Kanpur: పాపం పసివాడు.. ఆడుకోవడానికని వెళ్లాడు, ఆపై చేనులో నగ్నంగా..

11 Feb, 2022 08:07 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వావీవరుసలు, వయో భేదం లేకుండా.. చివరికి మూగ జీవాలను వదలకుండా లైంగిక దాడులకు పాల్పడుతున్నాయి మానవ మృగాలు. ఈ క్రమంలో యూపీలో జరిగిన ఓ ఘోరం.. వెన్నులో వణుకుపుట్టిస్తోంది. ఓ దళిత మైనర్​ చిన్నారిని అత్యంత క్రూరంగా హత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. 

ఉత్తర ప్రదేశ్​ కాన్పూర్ అవుటర్​ పరిధిలో ఈ ఘోరం చోటు చేసుకుంది. బాధిత కుటుంబం రైతుది. అతని పదేళ్ల కొడుకు సోమవారం మధ్యాహ్నం.. ఆడుకుంటానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. సాయంత్రం అయినా ఇంటికి రాకపోయేసరికి ఊరంతా వెతిక్కి.. రాత్రి సమయంలో పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం పోలీసులు వెతకడం ప్రారంభించారు. ఈ లోపు ఊరి బయట ఆవ చేనులో ఓ బాలుడి మృతదేహాన్ని పనులకు వెళ్లిన ఓ మహిళ గుర్తించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. అది కనిపించకుండా పోయిన మైనర్​దేనని తేలింది.
 
బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడి.. ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాలుడి మృతదేహం నగ్నంగా పడి ఉంది.  దుస్తులు యాభై మీటర్ల దూరంలో పడేసి ఉన్నాయి. ఘాతుకానికి పాల్పడే సమయంలో ప్రతిఘటించడంతో ఆ పిల్లాడిపై బండరాళ్లతో దాడి చేసి ఉంటారని, కన్నుకి తీవ్రంగా గాయమైందని, ఒంటిపై పంటి గాట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. 

అయినప్పటికీ లైంగిక దాడి జరిగిందా? ఎలా హత్య చేశారు? అనే విషయాల నిర్ధారణకై శవపరీక్ష కోసం ఎదురుచూస్తున్నామని, అనుమానితులను ప్రశ్నిస్తున్నామని కాన్పూర్​ ఏఎస్పీ ఆదిత్య కుమార్​ వెల్లడించారు. మరోవైపు చనిపోయింది పదేళ్ల బాలుడు కావడం, ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటడంతో.. గ్రామస్థుల్లో కోపం కట్టలు తెంచుకుంది. దీంతో కాసేపు రహదారి దిగ్భంధించి నిరసనలు వ్యక్తం చేశారు. ఆపై పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు.

మరిన్ని వార్తలు