ముంబై: దేశ వాణిజ్య రాజధానిలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 900కు పైగా మంది బలవన్మరణానికి పాల్పడ్డారని ముంబై పోలీసులు తెలిపారు. గతంలో నగరంలో నమోదైన మొత్తం కేసులతో పోలిస్తే ఆత్మహత్య కేసుల్లో ఈసారి 14 శాతం మేర తగ్గుదల నమోదైందని వెల్లడించారు. ఈ మేరకు నివేదిక విడుదల చేశారు. దీని ప్రకారం.. బలవన్మరణం చెందిన వారిలో 19-30 ఏళ్ల వయస్సు గల వారి సంఖ్య ఎక్కువగా ఉండగా.. వృద్దుల సంఖ్య 10 శాతంగా నమోదైంది. ఇక వీరిలో కరోనా మహమ్మారి కారణంగా నగరంలో విధించిన సంపూర్ణ లాక్డౌన్ వల్ల వ్యాకులతకు లోనై 371 మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. (చదవండి: ఘర్షణ: యువ ఆర్కిటెక్ట్ దారుణ హత్య)
ఈ విషయం గురించి సైక్రియాట్రిస్టులు మాట్లాడుతూ.. కోవిడ వ్యాప్తి నేపథ్యంలో చాలా మంది ఉపాధి కోల్పోవడంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. లాక్డౌన్ నిబంధనలతో ఒంటరితనానికి తోడు ఆర్థిక సమస్యలు తలెత్తడం, ఇంటికే పరిమితం కావడంతో మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారని అభిప్రాయపడ్డారు. ఇవే గాకుండా మానవ సంబంధాలు దెబ్బతినడం కూడా ఆత్మహత్యలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. సమస్యను వెంటనే గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా బలవన్మరణాలను అరికట్టవచ్చని తెలిపారు.