డేటింగ్‌ పేరుతో చీటింగ్‌

10 Oct, 2020 09:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక వాణిజ్య ప్రకటనలు ఉచితంగా పొందుపరుచుకోవడానికి ఉద్దేశించిన ‘లొకంటో.కామ్‌’ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది. ఈ సైట్‌ను వేదికగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు తాము టార్గెట్‌ చేసుకున్న వారిని నిలువునా ముంచుతున్నారు. ఈ నేరం వల్లోపడిన నగరానికి చెందిన ఓ డాక్టర్‌ నాలుగు నెలల్లో రూ.41.5 లక్షలు కోల్పోయాడు. ఎట్టకేలకు మోసపోయానని గుర్తించి శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.  

  • నగరంలోని పద్మారావ్‌నగర్‌కు చెందిన వ్యక్తి (57) వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాల నుంచి వైద్యపట్టా పొందారు. ఆపై కేంద్ర ప్రభుత్వ సర్వీసులో వైద్యుడిగా ఎంపికై ప్రస్తుతం గుజరాత్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. 
  • లాక్‌డౌన్‌ ప్రారంభమైన నాటి నుంచి ఈయన నగరానికే పరిమితం అయ్యారు. ఈ వైద్యుడు జూన్‌లో లొకంటో సైట్‌ను బ్రౌజ్‌ చేస్తుండగా అందులో కనిపించిన ఓ ప్రకటనకు ఆకర్షితుడయ్యాడు.  
  • కొందరు సైబర్‌ నేరగాళ్లు ఇంటర్‌నెట్‌ నుంచి సంగ్రహించిన ఆకర్షణీయమైన యువతుల ఫొటోలు అందులో పోస్టు చేశారు. అందులో సెల్‌ నెంబర్లుకు ఇచ్చిన నేరగాళ్లు డేటింగ్‌పై ఆసక్తి ఉంటే కాల్‌ చేయాల్సిందిగా సూచించారు.  
  • ఈ ప్రకటన చూసిన వైద్యుడు వారికి కాల్‌ చేయగా..కొందరు వ్యక్తులు మాట్లాడారు. యాడ్‌లో పోస్టు చేసిన ఫొటోలు ఉన్న యువతులు డేటింగ్‌కు సిద్ధంగా ఉన్నారంటూ ఉచ్చులోకి దింపారు.  
  • వారిని కలుసుకోవాలంటే రిజిస్ట్రేషన్‌ చేసుకుని, కొంత మొత్తం అడ్వాన్స్‌గా చెల్లించాలంటూ తమ బ్యాంకు ఖాతా వివరాలు అందించారు. ఇలా ఈ ఏడాది జూన్‌ 6 నుంచి ఈ వైద్యుడు ‘చెల్లింపులు’ మొదలెట్టారు.  
  • రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించిన తర్వాత కథ వాట్సాప్‌లోకి మారింది. ఇతడు ఎంచుకున్న యువతులే చాట్‌ చేస్తున్నట్లు, మాట్లాడుతున్నట్లు సీన్‌ క్రియేట్‌ చేశారు. తనను కలుసుకోవాలంటే మరికొంత మొత్తం చెల్లించాలని చెప్పించారు. 
  • ఇక అప్పటి నుంచి సీన్‌ బ్యాంకు ఖాతాలకు బదులుగా పేటీఎం, గూగుల్‌ పే వంటి ఈ–వాలెట్స్‌కు మారింది. దఫదఫాలుగా నగదు వేయించుకుంటూ వెళ్లారు. ప్రతి సందర్భంలోనూ చెల్లించిన మొత్తంలో ‘చార్జీలు’ పోను మిగిలింది రిఫండ్‌ అంటూ చెప్పారు. 
  • ఏ దశలో అయినా డబ్బు డిపాజిట్‌ చేయడం/బదిలీ చేయడం ఆపేస్తే అప్పటి వరకు చెల్లించిన మొత్తం కూడా తిరిగి రాదంటూ బెదిరించారు. దీంతో నగర వైద్యుడు డబ్బు చెల్లిస్తూ పోయాడు. ఇలా నాలుగు నెల్లో రూ.41.5 లక్షలు చెల్లించేశాడు.  
  • తనకు వచ్చే జీతంలో దాచుకున్న దానితో పాటు అప్పులు చేసి, చివరకు ప్రావిడెంట్‌ ఫండ్‌ లోన్లు తీసుకుని గత నెల ఆఖరు వరకు డబ్బు చెల్లించేశాడు. నేరగాళ్లు ఇంకా డబ్బు డిమాండ్‌ చేస్తుండటంతో ఆలోచనలో పడ్డాడు. 
  • ఈ లోపు విషయం అతడి కుటుంబీలకు తెలియడంతో వారు అప్రమత్తమై ఇంక డబ్బు చెల్లించకుండా చూశారు. శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. 
  • ఏసీపీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ నేరగాళ్లు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారిగా అనుమానిస్తున్నారు.  
  • లోకంటో సైట్‌ కేంద్రంగా జరుగుతున్న నేరాలను ఇటీవల పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. 

ఖాతాలు మార్చి రూ.2.09 కోట్ల గోల్‌మాల్‌ 
సాక్షి, హైదరాబాద్‌: నగరానికి చెందిన ప్రముఖ డిజైనర్‌ స్టోన్స్‌ తయారీ సంస్థ పోకర్ణ ఇంజినీరింగ్‌ స్టోన్‌ లిమిటెడ్‌ (పీఈఎస్‌ఎల్‌) సంస్థ సైబర్‌ నేరగాళ్లకు టార్గెట్‌గా మారింది. ఈ సంస్థకు చెందిన అధికారిక మెయిన్‌ సర్వర్‌ను హ్యాక్‌ చేసిన ‘ఈ–క్రిమినల్స్‌’ వాటిలోని ఉత్తరప్రత్యుత్తరాలను సంగ్రహించారు. వీటి ఆధారంగా నకిలీ ఇన్వాయిస్‌లు, బోగస్‌ ఈ–మెయిల్‌ ఐడీలు సృష్టించి రూ.2.09 కోట్లు గోల్‌మాల్‌ చేశారు. నాలుగు నెలల కాలంలో, మూడు దఫాల్లో జరిగిన ఈ స్కామ్‌పై దాని యజమాని గౌతమ్‌ చాంద్‌ జైన్‌ శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.  

  • సికింద్రాబాద్‌ కేంద్రంగా పనిచేసే పీఈఎస్‌ఎల్‌కు అంతర్జాతీయంగానూ క్లయింట్స్‌ ఉన్నారు. ఈ సంస్థ ప్రధానంగా అమెరికా, మెక్సికో, బెల్జియంలకు చెందిన కంపెనీలతో లావాదేవీలు చేస్తుంటుంది.  
  • ఈ క్రయవిక్రయాలకు సంబంధించి ఆయా కంపెనీల మధ్య ఈ–మెయిల్స్‌ రూపంలో ఉత్తరప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. ప్రతి కంపెనీ మెయిల్‌ రూపంలోనే ఇన్వాయిస్‌లను పంపి ఆ మేరకు అడ్వాన్స్‌ల్ని తీసుకుంటూ ఉంటుంది.  
  • కొందరు సైబర్‌ నేరగాళ్లు అకౌంట్‌ టేకోవర్‌ నేరానికి తెగబడ్డారు. ఇందులో భాగంగా పీఈఎస్‌ఎల్‌ సంస్థకు చెందిన అధికారిక ఈ–మెయిల్‌ అకౌంట్‌ను హ్యాకింగ్‌ చేసి అందులో ఉన్న ఉత్తరప్రత్యుత్తరాలను పరిశీలించారు.  
  • ఈ నేపథ్యంలో పీఈఎస్‌ఎల్‌కు, అమెరికా, మెక్సికో, బెల్జియం సంస్థలకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు గుర్తించారు. దీన్ని క్యాష్‌ చేసుకోవడానికి రంగంలోకి దిగిన సైబర్‌ నేరగాళ్ళు పీఈఎస్‌ఎల్‌ మెయిల్‌ ఐడీని పొందినదే మరోటి సృష్టించారు.  
  • ఇందులో కేవలం స్వల్పమార్పులు చేసి సాధారణంగా గుర్తుపట్టలేని విధంగా తయారు చేశారు. 
  • ఈ నకిలీ ఇన్వాయిస్‌లు మొత్తం యథాతధంగా ఉంచిన దుండగులు కేవలం బ్యాంకు ఖాతా వివరాలు ఉండే చోట మాత్రం అసలు వాటికి బదులుగా తమకు చెందిన ఖాతాల వివరాలు జొప్పించారు.  
  • అనివార్య కారణాల నేపథ్యంలో బ్యాంకు ఖాతా మార్చామని, ఈసారి నుంచి ఇందులోనే నగదు జమ చేయాలని ఆ మెయిల్‌లో కోరారు. నాలుగు నెలల క్రితం దీన్ని మెక్సికో, అమెరికా సంస్థలకు పంపాడు. 
  • ఈ మెయిల్‌ చూసిన ఆయా సంస్థలు నిజమని నమ్మి అడ్వాన్సులుగా 160665 డాలర్లు (రూ.1.17 కోట్ల), 56,000 డాలర్లు (40.91 లక్షలు) బదిలీ చేసేశాయి. తమ కు రావాల్సిన అడ్వాన్సుల కోసం పీఈఎస్‌ఎల్‌ సంస్థ ఆయా కంపెనీలను సంప్రదించగా విషయం తెలిసింది.
  • దీంతో తాను మోసపోయామని గుర్తించిన ఆ రెండు సంస్థలూ అమెరికా, మెక్సికోల్లోని పోలీసు విభాగాలకు ఫిర్యాదులు చేయడంతో అక్కడే కేసులు నమోదు అయ్యాయి.  
  • అంతటితో ఆగని సైబర్‌ నేరగాళ్ళు బెల్జియం సంస్థకు చెందిన అధికారిక మెయిల్‌ ఐడీని పోలినది మరోటి తయారు చేశారు. మరో నకిలీ ఇన్వాయిస్‌ను సృష్టించిన దుండగులు దీని ఆధారంగా పీఈఎస్‌ఎల్‌ సంస్థకు మెయిల్‌ పంపారు. 
  • అందులో తమకు చెల్లించాల్సిన 59,826 యూరోలు (రూ.51.59 లక్షలు) కొత్తగా తెరిచిన ఖాతాకు బదిలీ చేయాల్సిందిగా కోరారు. పీఈఎస్‌ఎల్‌ సంస్థ అలానే చేయడంతో ఆ మొత్తమూ సైబర్‌ నేరగాళ్ళకు చేరింది. 
  • ఎట్టకేలకు జరిగిన మోసాలు తెలుసుకున్న పీఈఎస్‌ఎల్‌ యాజమాని సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.మోహన్‌రావు ఇది నైజీరియన్లు చేసిన నేరంగా ప్రాథమిక అంచనాకు వచ్చారు.
మరిన్ని వార్తలు