వంట విషయంలో తల్లి, కూతురు గొడవ.. ఖాళీ బీరు సీసా తీసుకుని..

10 May, 2022 08:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,మహబూబ్‌నగర్‌ క్రైం: ఇంట్లో వంట విషయంలో తల్లి, కూతురు గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే కూతురు దాడి చేయడంతో తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. మహబూబ్‌నగర్‌ రూరల్‌ ఎస్‌ఐ రవి కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని కోయనగర్‌లో తల్లి నజ్మాబేగం, కూతురు మోహిన్‌బేగం ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కొన్నాళ్లుగా వీరు బీడీలు విక్రయించి జీవనం సాగిస్తున్నారు. అయితే సోమవారం మధ్యాహ్నం వంట విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఒకరిపై మరొకరు కర్రలతో దాడి చేసుకోవడమే గాక కారంపొడి చల్లుకున్నారు.

ఈ క్రమంలోనే తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆమెను జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జీవన్‌ను వివరణ కోరగా తల్లి తలపై గాయాలు ఉన్నాయన్నారు. మెడ, గొంతు భాగాల్లో పదునైన ఆయుధంతో కోసినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయన్నారు. ఇదిలాఉండగా తల్లి, కూతురుకు మద్యం తాగే అలవాటు ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. తాజాగా తల్లిని కూతురు డబ్బులు కావాలని అడగడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న ఖాళీ బీరు సీసాతో దాడి చేయడంతో పాటు కత్తితో మెడ, గొంతుపై కోసినట్టు సమాచారం. అయితే కూతురు కత్తితో గొంతు కోయలేదని పోలీసులు చెబుతున్నారు. తీవ్ర గాయం ఎలా అయిందనే విషయంపై విచారణ చేస్తున్నామన్నారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు రూరల్‌ ఎస్‌ఐ రవి తెలిపారు.

చదవండి: విశాఖపట్నం నుంచి తొలిసారిగా కొరాపుట్‌కు రైలు.. షాకిచ్చిన ప్రయాణికులు 

మరిన్ని వార్తలు