పరువు కోసం కూతుర్ని హతమార్చిన తండ్రి

26 Jul, 2020 06:47 IST|Sakshi
మృతురాలు సెంతారకై ఫైల్‌ ఫోటో

పోస్టుమార్టంతో గుట్టురట్టు 

కాంచీపురం జిల్లాలో ఘటన 

సాక్షి, చెన్నై: తన కుమార్తెను పరువు కోసం హతమార్చిన ఓ తండ్రి, బాత్‌రూంలో జారిపడ్డట్టుగా నాటకాన్ని రక్తి కట్టించాడు. అయితే, పోస్టుమార్టం నివేదికలో ఆ యువతి గొంతు నులిమి హతమార్చినట్టు తేలడంతో ఆ తండ్రి నాటకం గుట్టురట్టు అయింది. ఈ ఘటన కాంచీపురం జిల్లాలో చోటుచేసుకుంది. కాంచీపురం జిల్లా ఉత్తర మేరకు చెందిన బాలాజీ కుమార్తె సెంతారకై రెండు రోజుల క్రితం బాత్‌రూంలో మృతదేహంగా తేలింది. ఆమె బాత్‌రూంలో జారిపడి మరణించినట్టు కుటుంబీకులు తేల్చారు. అయితే, అనుమానాలు బయలు దేరడంతో పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. అంత్యక్రియలు ముగిశాయి. ఆ యువతి బాత్‌రూంలో జారిపడి మరణించినట్టు కుటుంబీకులు నాటకాన్ని బాగానే రక్తి కట్టించారు. దీనిని సర్వత్రా నమ్మేశారు. అయితే, తప్పు చేసిన వాడు ఏదో ఒక రూపంలో చిక్కక తప్పదు అన్నట్టుగా ఈ కుటుంబం గుట్టు పోస్టుమార్టం నివేదిక బయటపెట్టింది. 

గొంతు నులిమి చంపేశాడు.. 
సెంతారకై స్థానికంగా ఓయువకుడ్ని ప్రేమించినట్టున్నారు. ప్రియుడితో సెంతారకై చెట్టా పట్టాల్ని తండ్రి బాలాజీ పసిగట్టాడు. ఆ యువకుడితో పెళ్లి చేయడం ఇష్టం లేని బాలాజీ, ఆగమేఘాలపై సెంతారకైకు వివాహ ఏర్పాట్లు చేశాడు. కరోనా భయం, లాక్‌ కష్టాలు ఉన్నా, ఏ మాత్రం తగ్గకుండా కుమార్తె వివాహం బలవంతంగా చేశాడు. అయితే, తనకు జరిగిన బలవంతపు వివాహంపై సెంతారకై తీవ్ర ఆగ్రహంతో ఉండడమే కాకుండా అంత్తారింటికి వెళ్లకుండా మారం చేస్తూ వచ్చినట్టుంది. దీంతో ఆమెను బలవంతంగా అత్తారింటికి పంపించేందుకు తండ్రి బాలాజీ, ఇతర కుటుంబీకులు తీవ్రంగానే ప్రయత్నించారు. అదే సమయంలో ఆ యువకుడితో తన కుమార్తె పారిపోయిన పక్షంలో కుటుంబం పరువు బజారుకెక్కుతుందన్న ఆందోళనలో బాలాజీ పడ్డట్టున్నారు. దీంతో తన కుమార్తెను గొంతు నులిమి హతమార్చి, బాత్‌రూంలో జారిపడి మరణించినట్టుగా నాటకాన్ని రక్తికట్టించి అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో బాలాజీని శనివారం అరెస్టు చేసిన పోలీసులు మధురాంతకం సబ్‌జైలుకు తరలించారు. 

>
మరిన్ని వార్తలు