యూనివర్సీటీ లైబ్రరీలో చదువుతూ..ఉద్యోగం రాలేదని..

27 Mar, 2021 03:53 IST|Sakshi

గూడూరు: ఓ నిరుద్యోగ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని కేయూ గ్రౌండ్‌ వద్ద చోటుచేసుకుంది. ఆ యువకుడు తీసిన వీడియో, బంధువుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలోని తేజావత్‌ రాంసింగ్‌తండాకు చెందిన బోడ సునీల్‌ నాయక్‌ 2016లో డిగ్రీ పూర్తి చేశాడు. అప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే తపన తో కాకతీయ యూనివర్సీటీ సమీపంలో స్నేహితులతో కల సి ఉంటున్నాడు. 

తరచూ యూనివర్సిటీ లైబ్రరీకి వచ్చి పోటీ పరీక్షలకోసం చదువుకునేవాడు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో సునీల్‌ తన సోదరుడికి ‘ఐ మిస్‌ యూ’ అంటూ ఫోన్‌లో మెస్సెజ్‌ పంపించగా.. అతను తిరిగి ఫోన్‌ చేయడంతో తాను పురుగు మందు తాగినట్లు చెప్పాడు. దీంతో అతని సోదరుడు 108 అంబులెన్స్‌ కు ఫోన్‌ చేయగా.. సిబ్బంది మద్యాహ్నం 12 గంటల సమయంలో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా సునీల్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 48 గంటలు దాటితే కాని ఏ విషయం చెప్పలేమని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు