ఓయో లాడ్జ్‌ నిర్వాకం వల్లే ఇదంతా!

16 Oct, 2020 14:23 IST|Sakshi
అత్యాచార ఘటన నిందితులు

యువతిపై అత్యాచారం కేసులో ఆ ముగ్గురూ మేజర్లే

సాక్షి, హైదరాబాద్‌: కూకట్‌పల్లి అత్యాచారం ఘటనలో వెలుగులోకి కొత్త విషయాలు బయటపడుతున్నాయి. అత్యాచారానికి పాల్పడిన ముగ్గురూ మేజర్లని పోలీసులు తేల్చారు. బాధిత యువతి ఆసుపత్రిలో చేరిన తర్వాత కేసును జూబ్లీహిల్స్ పోలీసులు కూకట్‌పల్లికి బదిలీ చేశారు. నిందితులు జోసెఫ్‌, రాము, న‌వీన్‌లపై కేసు నమోదు చేసుకున్న కూకట్‌పల్లి పోలీసులు వారిని  అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. అయితే, యువతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులంతా కనిపించకుండా పోయారు. వారి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలాఉండగా..  యువతి సికింద్రాబాద్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్నట్టు తెలిసింది.
(చదవండి: కూకట్‌పల్లిలో దారుణం)

పోలీసుల అదుపులో ఓయో సిబ్బంది
ఓయో హోటల్‌ నిర్వాకం వల్లే అమాయక యువతులపై కామాంధులు రెచ్చిపోతున్నారని సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురికీ ఓయో సిబ్బంది ప్రత్యేక గదిని కేటాయించినట్టు తెలిసింది. గతంలో లైగింక దాడి, హింసా ఘటనలు జరిగినా ఓయో యాజమాన్యం తీరుమారడం లేదు. యువతకు విచ్చలవిడిగా అద్దెకు గదులు ఇస్తున్నారు. యువతులను వెంట తీసుకెళుతున్నా హోటల్‌ నిర్వాహకులు పట్టించుకోవడం లేదు.

కూకట్‌పల్లిలోని ఓయో ఆనంద ఇన్‌ హోటల్‌ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని, నిబంధనలు పట్టించుకోకుండా ఎవరికి పడితే వారికి రూమ్‌లు కేటాయిస్తున్నారని స్థానికులు ధ్వజమెత్తారు. ఇక గదుల కేటాయింపులకు సంబంధించి మీడియా హోటల్‌కు చేరుకోగానే ఓ జంట అక్కడ నుంచి పరారైంది. ఈ దృశ్యాలు కెమెరాకి చిక్కాయి. మీడియా కథనాలతో స్పందించిన పోలీసులు ఓయో హోటల్ నిర్వాహకులను, సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
(చదవండి: ఫార్మసిస్ట్‌ ఆత్మహత్య.. సింహాద్రి బాలుపై తండ్రి ఆరోపణ)

మరిన్ని వార్తలు