వీడియో: గోడపై మూత్రం పోయడంతో గొడవ.. తల్లిని దుర్భాషలాడినందుకు వెంటాడి చంపాడు

13 Aug, 2022 14:29 IST|Sakshi

ఢిల్లీ: దేశ రాజధానిలో ఘోరం జరిగింది. బిజీ మార్కెట్‌లో అంతా చూస్తుండగానే ఓ వ్యక్తిని వెంటాడి మరీ కత్తితో హతమార్చింది ఓ గ్రూప్‌. గోడపై మూత్రం పోశాడనే కారణంతో మొదలైన గొడవ.. పెద్దదై చివరకు ఇలా హత్యకు దారి తీసింది. 

మయాంక్‌(25) అనే హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థి.. గురువారం సాయంత్రం ఓ ఇంటి గోడపై మూత్రం పోశాడు. అయితే ఆ ఇంటి యాజమానురాలు మయాంక్‌ను మందలించింది. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.. ఆమెను మయాంక్‌ దుర్భాషలాడడంతో వివాదం పెద్దది అయ్యింది. ఆమె కొడుకు మనీష్‌ జోక్యం చేసుకోవడంతో.. అతనిపైనా దాడికి దిగాడు మయాంక్‌. 

దీంతో మనిష్‌.. తన స్నేహితులను పిలిచి.. మయాంక్‌ను వెంబడించారు. దక్షిణ ఢిల్లీ డీడీఏ మార్కెట్‌ సమీపంలో మాలవియా నగర్‌ దగ్గర అంతా చూస్తుండగానే మయాంక్‌ను వెంటాడి పొడిచి చంపేశారు. ఘటన తర్వాత నిందితులంతా తలోదిక్కు పారిపోయారు. మయాంక్‌ను స్థానికులు ఎయిమ్స్‌ను తరలించినప్పటికీ.. లాభం లేకుండా పోయింది. 

సీసీ టీవీ ఫుటేజీలో ఈ హత్య ఘటన నమోదు కాగా.. సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అయ్యింది. నిందితులు మనీష్‌, రాహుల్‌, అశిశ్‌, సూరజ్‌లను పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ద్వారా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హత్యోందతం వెనుక ఉన్న కారణాలను వెల్లడించారు వాళ్లు.

>
మరిన్ని వార్తలు