షాకింగ్.. ఢిల్లీ ఘటన అంజలి ఇంట్లో చోరీ.. ఫ్రెండ్ నిధిపైనే అనుమానం!

9 Jan, 2023 15:34 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో జనవరి 1న అంజలి అనే యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటనలో ఆమె మరణించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అమన్ విహార్‌లోని ఆమె ఇంట్లో దొంగతనం జరిగింది. కొందరు దుండగులు తాళం పగలగొట్టి ఇంట్లోని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. మరొకొన్నింటిని ధ్వంసం చేశారు. సోమవారం ఉదయం 7:30గంటల సమయంలో అంజలి తల్లిదండ్రులకు పొరుగింటివారు ఈ విషయాన్ని తెలియజేశారు.

ఇంట్లో టీవితో పాటు ఇతర విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారని  అంజలి కుటుంబసభ్యులు తెలిపారు. ఈ చోరీలో అంజలి స్నేహితురాలు నిధి హస్తం ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. వారం రోజులుగా ఇంటివద్ద భద్రతగా ఉన్న పోలీసులు దొంగతనం జరిగిన రోజు ఎందుకు లేరని ప్రశ్నించారు. అయితే పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించాల్సి ఉంది.

జనవరి 1న అంజలి, ఆమె స్నేహితురాలు నిధి స్కూటీపై వెళ్తుండగా మద్యం సేవించిన యువకులు కారుతో ఢీకొట్టారు. అంజలి కారు చక్రాల కింద ఇరుక్కున్నా పట్టించుకోకుండా వాహనాన్ని 12 కిలోమీటర్లు తిప్పారు. దీంతో ఆమె దారుణంగా చనిపోయింది. న్యూ ఇయర్ రోజున అంజలి మృతదేహం రోడ్డుపై నగ్నంగా లభ్యమవ్వడం కలకలం రేపింది.

అయితే అంజలి కారు కింద పడిపోయినప్పుడు నిధి ఆమె పక్కనే ఉంది. కానీ ఎలాంటి సాయం చేసేందుకు ప్రయత్నించకుండా అక్కడి నుంచి పారిపోయింది. దీంతో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
చదవండి: అది అత్యాచారం కిందకు రాదు.. ఒరిస్సా హైకోర్టు కీలక తీర్పు..

>
మరిన్ని వార్తలు