లగ్జరీ కార్లు అతని టార్గెట్‌! ఎవరీ ‘కారు కింగ్‌’

16 Jan, 2022 09:24 IST|Sakshi

లగ్జరీ కార్లను చోరీ చేయడామే వృత్తిగా ఎంచుకున్న ఓ దొంగను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద మూడు కార్లు, కారు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన నంబర్‌ ప్లేట్లు, కార్ల తాళాలు, విడి భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కునాల్‌ అనే 42 ఏళ్ల వ్యక్తికి 2003 నుంచి లగ్జరీ కార్లను దొంగిలించడం ఓ అలవాటుగా మారింది.

డబ్బు కోసం చోరీ చేసిన కార్లను ఉత్తప్రదేశ్‌, కశ్మీర్‌లో అమ్మకం పెట్టేవాడు. అయితే ఇటీవల సివిల్ లైన్స్‌కు చెందిన శ్రేతాంక్ అగర్వాల్.. తన ఇంటి వద్ద పార్క్‌ చేసిన టయోటా ఫార్చ్యూనర్ కారు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కశ్మీరీ గేట్ వద్ద ఫార్చ్యూనర్ కారుతో కునాల్‌ను పట్టుకున్నారు. పోలీసులు చేపట్టిన విచారణలో అతని వద్ద పట్టుకున్న కారు రిజిస్ట్రేషన్, నంబర్ సంబంధం లేకపోవడంతో అరెస్ట్‌ చేశారు.

అయితే కునాల్‌కు 100 కార్లు దొంగతనం చేసి ‘కారు కింగ్‌’ అని పిలిపించుకోవాలని ఉందని పోలీసు విచారణలో పేర్కొన్నాడు. నిందితుడిపై ఢిల్లీలోని వివిధ పోలీస్ స్టేషన్లలో తొమ్మిది కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. కునాల్‌ విలాసవంతమైన జీవితం గడపడం కోసం తరచు లగ్జరీ కార్ల చోరీలకు పాల్పడుతున్నాడని పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు