యూపీలోనూ అదే దారుణం.. డెలివరీ ఏజెంట్‌ బైక్‌ను ఢీకొట్టి లాక్కెళ్లిన కారు

5 Jan, 2023 07:37 IST|Sakshi

లఖ్‌నవూ: సంచలనం సృష్టించిన ఢిల్లీ ఘటన తరహాలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ జరిగిన ఓ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి అతి సమీపంలోని నోయిడాలో నూతన ఏడాది వేడుకల వేళ ఓ డెలివరీ ఏజెంట్‌ను ఓ కారు ఢీకొట్టి 500 మీటర్లు లాక్కెళ్లినట్లు పోలీసులు తెలిపారు. దీంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు స్విగ్గీలో డెలివరీ ఏజెంట్‌గా పని చేస్తున్న కౌషల్‌గా గుర్తించారు. 

నూతన ఏడాది రాత్రి డెలివరీ ఇచ్చేందుకు వెళ్లాడు కౌషల్‌. నోయిడా సెక్టార్‌ 14లోని ఫ్లైఓవర్‌ సమీపంలో అతడి ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. సుమారు 500 మీటర్ల మేర లాక్కెళ్లింది. కౌషల్‌ మృతదేహాన్ని గమనించిన కారు డ్రైవర్‌ సమీపంలోని ఆలయం వద్ద కారును నిలిపేసి అక్కడి నుంచి పారిపోయాడు. కౌషల్‌ సోదరుడు అమిత్‌ బాధితుడికి ఆదివారం రాత్రి 1 గంటకు ఫోన్‌ చేశాడు. ఆ ఫోన్‌ను ‍సంఘటనా స్థలంలో ఉన్న ఓ వ్యక్తి మాట్లాడి జరిగిన విషయాన్ని చెప్పాడు. 

అమిత్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టామని తెలిపారు.

ఇదీ చదవండి: షాకింగ్.. స్కూటీపై వెళ్తున్న టీచర్‌ను ఢీకొట్టి 3 కి.మీ ఈడ్చుకెళ్లిన ‍ట్రక్కు..

మరిన్ని వార్తలు