జరిమానా చెల్లించలేదని కుల బహిష్కరణ

14 Jan, 2023 01:38 IST|Sakshi
పెనుబల్లి శ్రీనివాస్, కుటుంబ సభ్యులు   

బాధిత కుటుంబంపై భౌతిక దాడి

ములకలపల్లి: కుల పెద్దలు విధించిన జరిమానా కట్టలేదనే నెపంతో ఓ కుటుంబాన్ని బహిష్కరించడమే కాక తాగునీటి పైపులైన్‌ తొలగించి, వారి ఇంటికి ఎవరూ వెళ్లొద్దని చాటింపు వేయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాచన్నగూడెంలో ఈ ఘటన జరిగింది. రాచ న్న గూడెంకు చెందిన గిరిజనుడు పెనుబల్లి శ్రీనివాస్‌.. తన తల్లిదండ్రులు, తమ్ముడు, తాత పోతరాజుతో కలసి ఉంటున్నాడు.

ఆయనకు దమ్మపేట మండలం ఎర్రగుంపు గ్రామా నికి చెందిన శారదతో వివాహం జరిగింది. అయితే, భా ర్యాభర్తల మధ్య మనస్పర్థలతో శారద ఏడాది కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా, నెల క్రితం శ్రీనివాస్‌ కూడా అక్కడికే వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఈనెల 10వ తేదీన శ్రీనివాస్‌ తాత కన్ను మూయగా.. భార్య శారదతో కలసి అతను రాచన్నగూడెంలోని ఇంటికి వచ్చాడు.

కుల పెద్దలకు చెప్పకుండా భార్య వద్దకు వెళ్లడం, ఏడాది క్రితం వెళ్లిపోయిన ఆమెను తీసుకువచ్చాడని శ్రీనివాస్‌ తాత అంత్యక్రియలు ముగియగానే కులపంచాయితీ పెట్టారు. శ్రీనివాస్‌ రూ.1.5 లక్షల జరిమానా కట్టాలని పెద్దలు తీర్పు చెప్పారు. కానీ పేదలమైనందున రూ.20 వేలు చెల్లిస్తామని శ్రీను తెలపడంతో కులపెద్దల సమక్షంలోనే కొందరు అతని కుటుంబీకులపై దాడి చేసి డబ్బు మొత్తం చెల్లించాలని హుకుం జారీ చేశారు.

అలాగే ఇంటి తాగునీటి పైపులైన్‌ తొలగించారు. కరెంట్‌ కూడా నిలిపివేస్తామని హెచ్చరించి.. శ్రీను ఇంటికి ఎవరూ వెళ్లొద్దని చాటింపు వేయించారు. దీంతో బాధిత కుటుంబం బుధవారం పోలీసులను ఆశ్రయించగా సర్పంచ్‌కు చెప్పి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. కానీ గురువారం  చిన్నకర్మ చేస్తుండగా, వచ్చిన గ్రా మస్తులు మళ్లీ నీటి సరఫరా నిలిపివేశారు. దీంతో బాధిత కుటుంబం శుక్రవారం మరోసారి పోలీస్‌స్టేషన్‌కు రాగా, పండుగ తర్వాత మాట్లాడుదామని చెప్పి పంపించారని శ్రీనివాస్‌ వాపోయాడు. ఈ విషయమై ఎస్సై సురేశ్‌ను వివ రణ కోరగా శనివారం విచారణ చేపడతామని తెలిపారు.

మరిన్ని వార్తలు