భూమి కబ్జాచేసి చంపేస్తామంటున్నారు.. పరిటాల శ్రీరామ్‌ నుంచి  రక్షణ కల్పించండి

21 Mar, 2023 10:56 IST|Sakshi
స్పందనలో ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌కు ఫిర్యాదు చేస్తున్న వెంకటరాముడు (ఇన్‌సెట్‌)లో వెంకటరాముడు 

సాక్షి, పుట్టపర్తి(శ్రీసత్యసాయి జిల్లా): తెలుగుదేశం నాయకుడు పరిటాల శ్రీరామ్‌ నుంచి తనకు ప్రాణహాని ఉందని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన చెరుకూరి వెంకటరాముడు సోమవారం ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. తన భూమిని కబ్జా చేయడమేగాక దాన్ని రాసి ఇవ్వమంటున్నారని, లేకపోతే చంపేస్తామని ఆయన అనుచరులు బెదిరిస్తున్నారని తెలిపారు. పరిటాల సునీత కబ్జాచేసిన తన భూమిని తనకు ఇప్పించాలని, తనకు రక్షణ కల్పించాలని కోరారు.

‘నా ఆస్తిని కబ్జా చేశారు. నన్ను కిడ్నాప్‌ చేశారు. ఆ ఆస్తి రాసిస్తాననడంతో వదిలేశారు. కానీ తర్వాత నేను నా ఆస్తి ఇచ్చేది లేదని స్పష్టం చేయడంతో నన్ను హత్యచేసేందుకు కుట్ర పన్నినట్లు తెలిసింది. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ అండతోనే ఆయన అనుచరులు ఇలా చేస్తున్నారు. వారి నుంచి రక్షణ కల్పించాలి..’ అని పేర్కొన్నారు. జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘స్పందన’లో ఆయన ఎస్పీకి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. అనంతపురం రూరల్‌ మండలం కక్కలపల్లి రెవెన్యూ లో 141–2 సర్వే నంబరులో 9.81 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి 1930 సంవత్సరం ముందు నుంచి వెంకటరాముడు పూర్వీకుల పేరిట ఉంది. తర్వాత మూడు భాగాలుగా పంచుకున్నారు. అందులో మూడోవంతు.. అంటే 3.27 ఎకరాలు చెరుకూరి వెంకటరాముడుకు దక్కింది. అందులో 1.63 ఎకరాలను ఆయన ఇతరులకు విక్రయించారు. మిగిలిన 1.64 ఎకరాల భూమిని తమకు రాసివ్వాలంటూ పరిటాల సునీత మంత్రిగా ఉన్నప్పటి నుంచి వేధిస్తున్నారు. అంతేకాకుండా మొత్తం 9.81 ఎకరాల భూమి ఇంకా సబ్‌ డివిజన్లు కాకపోవడంతో మొత్తం భూమిపై పరిటాల కుటుంబం కన్నేసింది.. అని వెంకటరాముడు పేర్కొన్నారు.

గత నెల 17న కిడ్నాప్‌ 
భూమి విషయమై గత నెల 17వ తేదీన ధర్మవరంలో ఉన్న వెంకటరాముడును కిడ్నాప్‌ చేశారు. పరిటాల అనుచరులు దాదా ఖలందర్, చింతలపల్లి మహేశ్‌నాయుడు, ఎల్‌.నారాయణచౌదరి, లిక్కర్‌ సుధాకర్‌నాయుడు ప్రోద్బలంతో కుంటిమద్ది అక్కులప్ప తన గ్యాంగ్‌తో వచ్చి కిడ్నాప్‌ చేసినట్లు అప్పట్లోనే వెంకట రాముడు అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని చోటుకు తీసుకెళ్లి తనను తీవ్రంగా కొట్టారని, వారు కోరుకున్నట్లుగా భూమి రాసిస్తానని చెప్పిన తర్వాత అదేరోజు సాయంత్రం ప్రాణాలతో వదిలారని ఆ ఫిర్యాదులో తెలిపారు.
చదవండి: టీడీపీ ‘సామాజిక’ చిచ్చు

మరిన్ని వార్తలు