మీకు తెలుసా?.. విద్యుత్‌ శాఖ నుంచి మెసేజ్‌లు రావు 

27 Jun, 2022 15:41 IST|Sakshi
సరఫరా నిలిపేస్తున్నట్లు ఇటీవల పలువురికి వచ్చిన ఫేక్‌ మెసేజ్‌

ఎంవీపీ కాలనీ(విశాఖపట్నం): ‘డియర్‌ కస్టమర్‌.. మీ విద్యుత్‌ సరఫరా ఈ రోజు రాత్రి 10.38 గంటలకు నిలిచిపోతుంది. మీరు గత నెల బిల్లు చెల్లించలేదు. వెంటనే మా 998... నంబర్‌లో సంప్రదించండి. ధన్యవాదాలు’. విద్యుత్‌ శాఖ నుంచి వచ్చినట్లుగా ఉండే ఈ తరహా సందేశాన్ని నమ్మి మీరు ఫోన్‌ చేశారో.. మీ బ్యాంకు ఖాతాలో నగదు ఖాళీ అయినట్లే. అదేలా అనుకుంటున్నారా.. అయితే ఈ క్రింది పేరా చదవండి..
చదవండి: నేను..నాలా‘గే’ ఉంటా.. స్వలింగ సంపర్కులు, థర్డ్‌ జండర్స్‌ ప్రైడ్‌ వాక్‌

మీకు వచ్చిన సందేశంలోని నంబర్‌కు ఫోన్‌ చేయగానే అవతలి వ్యక్తులు అచ్చం విద్యుత్‌ శాఖ అధికారులుగానే మాట్లాడతారు. మీరు బిల్లు చెల్లించినట్లు చెప్పినా ఆ సొమ్ము మాకు చేరలేదంటారు. ఒక యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని రూ.10 చెల్లిస్తే బిల్లు వివరాలు తమ సిస్టంలో జనరేట్‌ అవుతాయంటూ నమ్మిస్తారు. అది నమ్మి మీరు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని రూ.10 చెల్లిస్తే వారికి పంట పండినట్లే. ఇక మీ ప్రమేయం లేకుండానే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు విత్‌డ్రా అయిపోతాయి. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలు నగరాల్లో ఈ తరహా మోసాలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్‌ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి మెసేజ్‌లు పంపించడం, విద్యుత్‌ బకాయిలపై ఫోన్‌లో సంప్రదించడం వంటి చర్యలు విద్యుత్‌ శాఖ చేయదని స్పష్టం చేస్తున్నారు. 

  

మరిన్ని వార్తలు