Hyderabad: నైట్‌ డ్యూటీ.. నమ్మించి నర్సుపై వైద్యుడి లైంగికదాడి 

12 Aug, 2022 13:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హిమాయత్‌నగర్‌(హైదరాబాద్‌): ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సుపై వైద్యుడి కన్ను పడింది. మాయ మాటలు చెప్పాడు, నీ జీతం, ఆస్తి, రంగుతో సంబంధం లేదన్నాడు. ఓకే అంటే పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అంటూ తేనె మాటలు చెప్పి నర్సును శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఇప్పుడు పెళ్లిమాట ఎత్తిన నర్సును నోరు మూపించేందుకు పలు ప్రయత్నాలు చేసి, భౌతిక దాడికి సైతం దిగడంతో తనకు న్యాయం చేయాలంటూ నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ మెట్లిక్కిందో నర్సు.
చదవండి: పాతిపెట్టిన మహిళా మృతదేహం మాయం.. అసలేం జరిగింది?

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువతి హిమాయత్‌నగర్‌ స్ట్రీట్‌ నెంబర్‌–1 వద్ద ఉన్న మ్యానికైండ్‌ ఆసుపత్రిలో నర్సుగా చేస్తోంది. ఇదే ఆసుపత్రిలో రాంనగర్‌కు చెందిన కోటం సందీప్‌ భరద్వాజ్‌ అనే యువకుడు వైద్యుడిగా చేస్తున్నాడు. నర్సును ప్రేమిస్తున్నానంటూ డ్యూటీలో ఉన్నప్పుడే వేధిస్తుండేవాడు. 2020 ఫిబ్రవరి నెలలో ఇద్దరూ ఓ నాలుగు రోజుల పాటు నైట్‌ డ్యూటీ చేశారు. ఆ సమయంలో ఒకరోజు తన చాంబర్‌కు పిలిచిన వైద్యుడు కోటం సందీప్‌ భరద్వాజ్‌ తనని బలవంతం చేశాడు.

నర్సును పెళ్లి చేసుకుంటానన్నాడు. తక్కువ కులమైనా.. ఉద్యోగం తక్కువదైనా.. కలర్‌ లేకపోయినా.. ఆస్తి లేకపోయినా తనకేమీ పట్టింపులు లేవని మాయ మాటలు చెపి ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆ సమయంలో బ్లీడింగ్‌ అధికంగా అవ్వడంతో సమీపంలోని ఓ ఆసుపత్రిలో అడ్మిట్‌ చేర్పించాడు. రెండు రోజుల తర్వాత డిశ్చార్జి అయిన నర్సును గాంధీనగర్‌లోని తన ఫ్లాట్‌కు తీసికెళ్లాడు. బ్లీడింగ్‌ సమయంలో కూడా నర్సుపై వైద్యుడు బలవంతంగా అత్యాచారం చేశాడు. తీవ్ర అనారోగ్యానికి గురైన నర్సు వారం తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లింది.

ఇంటివద్ద ఉన్న నర్సుకు వైద్యుడు పదే పదే ఫోన్‌లు చేసి విసిగించేవాడు. పెండ్లి చేసుకుంటానని నమ్మించి నగరానికి రప్పించాడు. గాందీనగర్‌లో ఉన్న తన ఫ్లాట్‌లో ఎవరికీ తెలియకుండా నర్సును ఉంచాడు. ఇదే సమయంలో మూడు పర్యాయాలు యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పెండ్లి చేసుకోవాలని గట్టిగా అడగడంతో మీ కులం తక్కువ, నేను అడిగినంత కట్నం ఇవ్వలేవు, మా తల్లిదండ్రులకు కూడా ఇష్టం లేదని చెప్పి భౌతికంగా దాడి చేశాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్‌ రాపోలు శ్రీనివాస్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు