మహిళా వైద్యురాలి దారుణ హత్య

21 Nov, 2020 12:31 IST|Sakshi

సాక్షి, లక్నో: నేరగాళ్లు ఏ  వైపునుంచి చొరబడి ఎలా ప్రాణాలకు ముప్పు తెస్తారో తెలియని పరిస్థితి. సెట్ టాప్ బాక్స్‌ను రీఛార్జ్ చేయాలంటూ నెపంతో ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి ఒక మహిళా వైద్యురాల్ని దారుణంగా హత్య చేసిన ఘటన ఆందోళన రేపింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరు చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. 

డాక్టర్ నిషా సింఘాల్ (38) ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో దంతవైద్యురాలుగా పని చేస్తున్నారు. ఈమె భర్త అజయ్ సింఘాల్ సర్జన్‌గా ఉన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే శుక్రవారం మధ్యాహ్నం సెట్‌ టాప్‌ బాక్స్‌ రిపేర్‌ అంటూ ఇంట్లోకి వచ్చాడు దుండగుడు. అకస్మాత్తుగా నిషాపై కత్తితో దాడిచేసి గొంతుపై దారుణంగా పొడిచాడు. ఆ తరువాత వేరేగదిలో ఉన్న పిల్లలపైనా ఎటాక్‌ చేశాడు. విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రి విధుల్లో ఉన్న నిషా భర్త అజయ్‌ హుటాహుటిన ఇంటికి చేరి భార్యాపిల్లలను ఆసుపత్రికి తరలించారు.  చికిత్స పొందుతూ నిషా కన్నుమూయగా, చిన్నారులిద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడిని కేబుల్ టీవీ టెక్నీషియన్‌ శుభం పాథక్‌గా పోలీసులు గుర్తించారు. శనివారం ఉదయం అతడిని అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం చోరీకి ప్రయత్నించి హత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నా మన్నారు. 

మరిన్ని వార్తలు