కుక్కలు చంపాయి.. ఊరంతా పంచుకున్నారు

18 Jul, 2021 04:41 IST|Sakshi

దుప్పి మాంసం పంచుకున్న తొమ్మిది మందిపై కేసు

ములకలపల్లి (భద్రాద్రి కొత్తగూడెం) : దాహం తీర్చుకునేందుకు గ్రామంలోకి వచ్చిన దుప్పిపై కుక్కలు దాడిచేయడంతో మృతి చెందింది. ఈ క్రమంలో మృత్యువాత పడిన దుప్పిని కోసిన గ్రామస్తులు మాంసాన్ని పంచుకున్నారు. దీంతో అటవీ అధికారులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చాపరాలపల్లి శివారు అటవీ ప్రాంతం నుంచి ఓ దుప్పి దాహార్తి తీర్చుకునేందుకు గ్రామంలోకి వచ్చింది.

ఈ క్రమంలో ఊరకుక్కలు దాడి చేయడంతో మృతిచెందింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కొందరు దుప్పిని కోసి మాంసం పంచుకున్నారు. జరిగిన విషయం అటవీ అధికారులకు తెలియడంతో ఎఫ్‌ఎస్‌ఓ కిషన్‌ ఆధ్వర్యంలో అర్ధరాత్రి వేళ గ్రామంలో తనిఖీలు చేసి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిదిమంది గ్రామస్తులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చాపరాలపల్లి (ఈస్ట్‌) బీట్‌ ఆఫీసర్‌ మల్లికార్జునరావు శనివారం వెల్లడించారు.  

మరిన్ని వార్తలు