ఎంపీపై గృహహింస, వరకట్న వేధింపుల కేసులు

20 Dec, 2020 19:26 IST|Sakshi
నటుడు, బిజు జనతా దళ్‌ ఎంపీ అనుభవ్‌ మొహంతి

భువనేశ్వర్‌ : నటుడు, బిజు జనతా దళ్‌ ఎంపీ అనుభవ్‌ మొహంతిపై ఆదివారం గృహహింస, వరకట్న వేధింపుల కేసులు నమోదయ్యాయి. భార్య, నటి వర్ష ప్రియదర్శి ఈ మేరకు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుభవ్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అనుభవ్‌, అతడి స్నేహితులిద్దరు తనను కటక్‌లోని తమ నివాసంలోని ఓ గదిలో బంధించారని, పోలీసులు సహాయంతో బయటపడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. కాగా, గతంలో కూడా పలుమార్లు భర్తపై ఆమె కేసులు పెట్టారు. కొన్ని నెలల క్రితం.. అనుభవ్‌, వర్ష గొడవపడుతున్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వగా.. భర్త తన క్యారెక్టర్‌ను దెబ్బతీయటానికి ప్రయత్నిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించారు. ( స్నేహితులతో కలిసి భార్యపై అత్యాచారం )

అనుభవ్‌ తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆగస్టు 7న కోర్టులో గృహహింస కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో అనుభవ్‌ తనకు భార్యనుంచి విడాకులు కావాలంటూ ఢిల్లీలోని పటియాలా కోర్టుకెక్కారు. అయితే తమ విడాకుల కేసును కటక్‌ ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేయాలని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజా కేసు నేపథ్యంలో అనుభవ్‌ డీజీపీకి ఓ లేఖ రాశారు. ‘‘ నాకు, నా కుటుంబానికి ప్రమాదం పొంచి ఉంది. దయచేసి మమ్మల్ని కాపాడండి’’ అని లేఖలో పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు