వాడిని చంపేయండి.. వదలొద్దు!

28 Apr, 2021 12:54 IST|Sakshi

భర్త వేధింపులతో ఆత్మహత్య 

సూసైడ్‌ నోట్‌రాసి ఉరేసుకున్న మహిళ 

బంజారాహిల్స్‌: ‘విజయ అనే నేను.. నా భర్త పెట్టే బాధలు భరించలేక చనిపోతున్నాను. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి రోజూ చావకొడుతూనే ఉన్నాడు. మళ్లీ నన్ను డ్యూటీకి పొమ్మంటాడు. డ్యూటీకి పోతే అక్రమ సంబంధాలు అంటగడుతూ ఒంటి మీద బట్టలు లేకుండా కొట్టేవాడు. నన్ను చంపడానికి చూశాడు. నేను చనిపోయినా నా భర్తను మాత్రం వదలకండి చంపేయండి. మా ఆయన తన అన్న చంద్రయ్య అండతో నన్ను వేధించేవాడు. దాన్ని చంపేస్తే మీ అక్కబిడ్డనిచ్చి పెళ్ళి చేస్తాననేవాడు. నా చావుకు ముఖ్య కారణం ఈ అన్నదమ్ములు. నా పిల్లలు మా అమ్మానాన్న, అన్న, తమ్ముడితో ఉండాలని కోరుకుంటున్నాను’అంటూ... ఓ వివాహిత సూసైడ్‌ నోట్‌ రాసి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.  

పోలీసుల కథనం ప్రకారం... హైదరాబాద్‌ యూసుఫ్‌గూడ సమీపంలోని ఎస్పీఆర్‌ హిల్స్‌ రాజీవ్‌గాంధీ నగర్‌లో విజయ (31) భర్తతో కలిసి ఉంటోంది. వీరికి ఇద్దరు కొడుకులు. 14 సంవత్సరాల క్రితం ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లయిన నాటి నుంచి భర్త చిత్రహింసలు పెట్టేవాడు. దీంతో జీవితంపై విరక్తితో ఆమె మంగళవారం తెల్లవారుజామున తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు మరణానికి అల్లుడు ఆంజనేయులు కారణమని మృతురాలి తల్లి మణెమ్మ ఫిర్యాదు చేసింది.

పెళ్లి జరిగిన తెల్లవారి నుంచే అల్లుడు తమ కూతురిని అనుమానిస్తూ హింసించేవాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు ఆంజనేయులును అదుపులోకి తీసుకు న్నారు. ఈ నెల 26న రాత్రి 8 గంటలకు తన కూతురు ఫోన్‌ చేసి పిల్లలు జాగ్రత్త అంటూ చెప్పిందని, మరో రెండు గంటలకే అల్లుడు కొడుతున్నాడని చెప్పి ఏడ్చిం దని మణెమ్మ వాపోయింది. ఆ సమయంలో తన అల్లుడు ఫోన్‌ లాక్కొని మీ కూతురిని చంపేస్తానని చెప్పాడని, తెల్లవారి చూసేసరికి శవమై కనిపించిందని చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
(చదవండి: పంజాబ్‌ అబ్బాయి.. హైదరాబాద్‌ అమ్మాయి.. కట్‌ చేస్తే!)

మరిన్ని వార్తలు