డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టు రట్టు : ఎక్కడ దాచారంటే..

28 Nov, 2020 19:05 IST|Sakshi

సాక్షి, ముంబై:  మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో  కేటుగాళ్లు ఆరితేరిపోతున్నారు. డ్రగ్స్‌  వ్యాపారాన్ని,  దొంగ రవాణాను అడ్డుకునేందుకు నిఘా వర్గం ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ దానికి పై ఎత్తులు వేస్తూ మాఫియా ముఠా చెలరేగిపోతోంది. రకరకాల మార్గాల్లో మత్తు పదార్థాలను సునాయాసంగా దేశంలోకి పారిస్తూ, కోట్లరూపాయల దండుకుంటోంది. తాజాగా హెరాయిన్ను తరలించేందుకు  ముఠా  పన్నిన పన్నాగం చూసి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులే షాకయ్యారు.   

మత్తు పదార్థాలను మహిళల గౌన్లకు కుట్టిన  బటన్లలో దాచి పెట్టి మరీ ఇంటిలిజెన్స్‌ అధికారుల కన్ను గప్పాలని ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు  బెడిసికొట్టడంతో  చివరకు అధికారులకు చిక్కారు. ఈ సందర్భంగా  డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా రాకెట్‌ను  డీఆర్‌ఐ అధికారులు  ఛేదించారు.  మహిళల గౌన్లకు అమర్చిన బటన్స్‌లో హెరాయిన్‌ దాచి కొరియర్‌ ద్వారా దేశంలోకి తరలిస్తున్న ముఠాను గుర్తించిన అధికారులు 396 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు.దక్షిణాఫ్రికా నుండి ముంబైకి కొరియర్ ద్వారా దీన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు వెల్లడించారు.

మరిన్ని వార్తలు