విషాదం నింపిన నిషా: బైక్‌ కిందపడి గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స చేయంచుకుని..

13 Dec, 2021 04:30 IST|Sakshi
భార్యాపిల్లలతో బ్రహ్మచారి (ఫైల్‌)  

భార్య, కుమార్తె మృతి.. చావు బతుకుల్లో కొడుకు

బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం 

జిన్నారం (పటాన్‌చెరు): మద్యంమత్తులో డ్రైవింగ్‌ ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఓ వ్యక్తి తాగి బైక్‌ నడుపుతూ డివైడర్‌ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన భార్యకూతురు ప్రాణాలు కోల్పోయారు. అతడితోపాటు కుమారుడు తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. జిన్నారం మండలం గుమ్మడిదల గ్రామానికి చెందిన కమ్మరి బ్రహ్మచారి, కల్పన(25)దంపతులకు లాస్య, కృతిక, కార్తీక్‌ సంతానం.

బ్రహ్మచారి దినసరి కూలి. బొల్లారంలోని బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి ఆదివారం సాయంత్రం ఐదుగంటల సమయంలో బ్రహ్మచారితోపాటు భార్య కల్పన, కుమారుడు కార్తీక్‌(3), కూతురు కృతిక బైక్‌పై బయలుదేరారు.  అప్పటికే తాగి ఉన్నాడు.

గుమ్మడిదల నుంచి దోమడుగు మీదుగా వెళ్తుండగా బైక్‌ కిందపడటంతో కల్పన, చిన్నారులకు గాయాలయ్యాయి. దీంతో సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకుని అదే బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. దోమడుగు సమీపంలోని ప్రధాన మూలమలుపు వద్ద వేగంగా వెళ్తూ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. కల్పనతోపాటు చిన్నారి కృతిక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను పటాన్‌చెరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బ్రహ్మచారి, కార్తీక్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కార్తీక్‌ పరిస్థితి విషమంగా ఉంది. 

మరిన్ని వార్తలు