పోలీసుల్ని చితక్కొట్టిన మందుబాబులు 

27 Jun, 2021 11:20 IST|Sakshi

సాక్షి, చెన్నై(తమిళనాడు): మద్యం మత్తులో ఉన్న యువకులు తమను చెక్‌పోస్టులో ఆపిన పోలీసులపై దాడి చేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు పోలీసులు పరుగులుతీయాల్సి వచ్చింది. సేలంలో రెండు రోజుల క్రితం ఒక మందుబాబు తమ మీద తిరగ బడడంతో పోలీసులు లాఠీకి పనిచెప్పారు. దీంతో అతను మరణించాడు. ఈ కేసులో ఎస్‌ఐ అరెస్టయ్యారు. ఈ క్రమంలోనే దిండుగల్‌ జిల్లా వత్తలగుండు చెక్‌పోస్టు వద్దకు శుక్రవారం రాత్రి ఆరుగురు యువకులు వచ్చారు. ఒక బైకులో ముగ్గురు చొప్పు న ఉండడంతో ఎస్‌ఐ ధీరన్, హెడ్‌కానిస్టేబుల్‌ మేఘనాథన్, మరో కానిస్టేబుల్‌ వారిని అడ్డుకున్నారు. మద్యం మత్తులో ఉన్న యువకులు తమనే అడ్డుకుంటారా అని ఆగ్రహంతో ఊగిపోయారు.

మమ్మల్ని (మందుబాబుల్ని) చంపేస్తారా అంటూ కర్రలు, కొబ్బరి మట్టలతో చితక్కొట్టారు. గాయపడిన పోలీసులు పరుగులు తీసి ఆస్పత్రిలో చేరారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు చెక్‌పోస్టులోని సీసీ పుటేజీ ఆధారంగా మందు బాబుల కోసం గాలించారు. శనివారం ఉదయాన్నే వత్తలగుండుకు చెందిన రంజిత్, కాళిదాసు, మూర్తిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా సేలం చెక్‌ పోస్టులో హిందూ మున్నని నాయకుడు చెల్ల పాండియన్‌ పోలీసుల మీద వీరంగం ప్రదర్శించాడు. ఈ వీడియో వైరల్‌ కావడంతో ఆయన మీద కేసు నమోదైంది. అతన్ని హిందూ మున్నని నుంచి తొలగిస్తూ ఆ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.  

చదవండి:  పీఏతో మంత్రి రాసలీలలు.. ఫొటోలు లీక్‌ 

మరిన్ని వార్తలు