విషాదం: చక్రాల కింద నలిగిపోయిన చిన్నారి

27 Sep, 2020 18:33 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: ఓ వ్యక్తి నిర్లక్ష్యం ముక్కుపచ్చలారని చిన్నారిని చిదిమేసింది. కారు ముందున్న చిన్నారిని చూసుకోకుండా బండి తోలడంతో ఆమె ప్రాణాలు విడిచింది. జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ ప్రాంతం శివం అపార్ట్ మెంట్‌లో ఆదివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి.. తన కుటుంబంతో కలిసి అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో నివాసముంటున్నాడు. అక్కడే అపార్ట్‌మెంట్‌ వాసుల బైకులు, కార్లు పార్క్‌ చేస్తున్నారు. ఎప్పటిమాదిరిగానే 18 నెలల చిన్నారి మనస్వి తమ ఇంటి సమీపంలో ఆడుకుంటోంది. దురదృష్టమేంటో ఈ రోజు ఆమె పార్క్‌ చేసి ఉన్న కార్ల వద్దకు వెళ్లింది. అంతలోనే ఓ వ్యక్తి తన కారును స్టార్ట్‌‌ చేసుకుని ముందుకువెళ్లడంతో.. చక్రాల కింద నలిగి మనస్వి విగతజీవిగా మారింది. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం, కుటుంబ సభ్యులు పాపను గమనించకపోవడంతో ఘోరం జరిగిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు