డ్రగ్స్‌ కేసు: నేడు రియా బెయిల్‌ పిటిషన్‌ విచారణ

29 Sep, 2020 13:09 IST|Sakshi

ముంబై: డ్రగ్స్‌ కేసులో అరెస్టైన నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి బెయిలు పిటిషన్‌ను బాంబే హైకోర్టు నేడు విచారించనుంది. వీరిరువురితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురు వ్యక్తుల అభ్యర్థనపై విచారణ చేపట్టనుంది. కాగా బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి నేపథ్యంలో బయటపడిన డ్రగ్స్‌ వ్యవహారంపై నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రియాకు బెయిలు మంజూరు చేయవద్దంటూ ఎన్‌సీబీ సోమవారం తన నివేదికలో పేర్కొంది. రియా, ఆమె సోదరుడు స్వయంగా మాదక ద్రవ్యాలు సేవించడమే గాకుండా ఇతరులకు సరఫరా చేశారని, ఎన్‌డీపీఎస్‌ చట్టం ప్రకారం.. ఇది అత్యంత తీవ్రమైన నేరమని పేర్కొంది. (చదవండి: డ్రగ్స్‌ కేసు: వాళ్లంతా భార్యల కోసం ప్రార్థిస్తారు!)

అదే విధంగా.. రియాకు డ్రగ్స్‌ సిండికేట్‌తో సంబంధాలు ఉన్నాయని, ఆమె మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాలుపంచుకున్నారని నిరూపించేందుకు తగిన ఆధారాలు లభించాయని వెల్లడించింది. ఇక గతంలో రియా అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చిన నేపథ్యంలో ఇప్పుడైనా ఆమెకు బెయిల్‌ వస్తుందా లేదా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. కాగా బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి.. డ్రగ్‌ ట్రాఫికింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో సెప్టెంబరు 9న రియాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆమెను బైకుల్లా జైలుకు తరలించారు. రియా చెప్పిన వివరాల ఆధారంగా పలువురు సెలబ్రిటీల కదలికలపై నిఘా వేశారు. ఈ క్రమంలో సుశాంత్‌ మాజీ మేనేజర్‌ జయ సాహా వాట్సాప్‌ చాట్స్‌ బహిర్గతమైన నేపథ్యంలో స్టార్‌ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తదితరులను విచారించారు.(నలుగురిదీ ఒక్కటే మాట..)

మరిన్ని వార్తలు