బాంబు ఉన్న చేతిని పట్టుకోవడంతో..

30 Jan, 2021 12:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కోల్‌కతా: కోల్‌కతాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కొడుకును ఖతం చేద్దామనుకున్న తండ్రి అనూహ్యంగా తనే ప్రాణాలు విడిచాడు. కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల సమాచారం ప్రకారం.. మద్యానికి బానిసైన షేక్‌ మట్లబ్‌ (65)  కుటుంబంతో తరచూ గొడవ పడుతుండేవాడు. అతని కొడుకు షేక్‌ నాజీర్‌ సమీపంలోని ఓ కర్మాగారంలో పని చేసేవాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం పని ముగించుకుని ఇంటికి వచ్చిన షేక్‌‌ నజీర్‌కు తండ్రి మద్యం మత్తులో కనిపించాడు. దీంతో నజీర్‌ తండ్రితో గొడవకు దిగాడు. మాటామాటా పెరడంతో.. షేక్‌ మట్లబ్‌ నాటు బాంబుతో కొడుకుపై దాడి చేసేందుకు యత్నించాడు. తండ్రి చేతిలో బాంబు చూసిన నజీర్‌ అతడి చేయి పట్టుకుని ఆపే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో చేతిలోనే బాండు పేలి ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. 

బాంబు శబ్దం విన్న స్థానికులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా ఇద్దరూ తీవ్ర గాయాలతో కనిపించారు. వారిని స్థానిక ఆర్‌జీ కర్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వారికి చికిత్స అందిస్తుండగా తండ్రి షేక్‌ మట్లబ్‌ మృతి చెందగా కొడుకు షేక్‌ నజీర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే షేక్‌ మట్లబ్‌కు ఆ బాంబ్‌ ఎక్కడి నుంచి వచ్చింది.. ఇంకా ఘటనా స్థలంలో ఏమైనా బాంబులు ఉన్నాయని పోలీసులు బృందం గాలించింది. షేక్‌ మట్లబ్‌కు నేర చరిత్ర ఉందని, కొన్నేళ్ల క్రితం పలు కేసుల్లో అతను నిందితునిగా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు