కూతురు కళ్లెదుటే తండ్రి ఘాతుకం 

26 Apr, 2021 07:51 IST|Sakshi
మహేందర్‌, సారమ్మ(ఫైల్‌ ఫొటో)

గొడ్డలితో భార్యను నరికి చంపిన వ్యక్తి 

కందుకూరు/రంగారెడ్డి: పచ్చని కుటుంబంలో మద్యం మహమ్మారి నిప్పులు పోసింది. తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి తన భార్యను  కూతురు కళ్లెదుటే గొడ్డలితో నరికి చంపాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం జరిగింది. కందుకూరు మండలం దాసర్లపల్లికి చెందిన ఎర్గమోని మహేందర్‌(35) అదే మండలంలోని మీర్‌ఖాన్‌పేటకు చెందిన సారమ్మ అలియాస్‌ స్వరూప(33)ను 15 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు జస్వంత్‌(13), కూతురు తేజ(10) ఉన్నారు. మహేందర్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా, సారమ్మ కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

మహేందర్‌ తరచూ భార్యను కొడుతుండేవాడు. దీంతో రెండు నెలల క్రితం సారమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా మహేందర్‌కు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. శనివారం రాత్రి 11.40 గంటల సమయంలో మద్యం మత్తులో ఉన్న అతడు.. నిద్రిస్తున్న భార్యపై గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు. నిద్ర నుంచి మేల్కొన్న తేజ కళ్లెదుటే ఈ దారుణం జరగడంతో వణికిపోయి తన అన్నను నిద్ర లేపింది. తండ్రి వారిని బెదిరించి బయట గడియపెట్టి పరారయ్యాడు. పిల్లలు ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్లూస్‌ టీం వచ్చి వివరాలు సేకరించింది.  

చదవండి: భార్యభర్తల గొడవ ఎంత పనిచేసింది..

మరిన్ని వార్తలు