దేవుడా ఎందుకీ కడుపుకోత.. నేనేం పాపం చేశా..

28 Dec, 2021 13:41 IST|Sakshi
తల్లిదండ్రులతో ఇద్దరు కూతుళ్లు (ఫైల్‌)

క్రిస్మస్‌ పండుగ వేళ అక్కాచెల్లెళ్లను బలి తీసుకున్న కారు  

మద్యం మత్తులో స్కూటీని ఢీకొట్టిన డ్రైవర్‌  

ఒకరు అక్కడికక్కడే మృతి.. చికిత్స పొందుతూ సోమవారం మరొకరు..  

ఒకే ఇంట్లో రెండురోజులు అంత్యక్రియలు.. గ్రామంలో విషాదం

సాక్షి, రంగారెడ్డి(మొయినాబాద్‌): ‘దేవుడా ఎందుకీ కడుపుకోత.. ఒకేసారి ఇద్దరు బిడ్డల్ని తీసుకెళ్తావా..? నేనేం పాపం చేశా..’ అని ఓ మాృతమూర్తి గర్భశోకంతో తల్లడిల్లింది. వరుసగా రెండు రోజులు వారి అంత్యక్రియలు నిర్వహించడం హృదయాలను కలచివేసింది. అక్కాచెల్లెళ్లు తమ చిన్నాన్న కూతురితో కలసి క్రిస్మస్‌ వేడుకలకు శనివారం రాత్రి స్కూటీపై వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు సోమవారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. చిన్నాన్న కూతురు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల కడుపుకోతను చూసి బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోయారు.

చదవండి: (పెళ్లి బాజా మోగాల్సిన ఇంట విషాదం.. ఓ ప్రబుద్ధుడు పెళ్లి చెడగొట్టడంతో)

వివరాలు.. మొయినాబాద్‌ మండల పరిధిలోని రెడ్డిపల్లికి చెందిన మోర వెంకటేశ్, విజయలక్ష్మి దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నాడు. వెంకటేశ్‌ మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. క్రిస్మస్‌ సందర్భంగా స్నేహితులతో కలసి వేడుక చేసుకునేందుకు శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో వెంకటేశ్‌ కూతుళ్లు ప్రేమిక (16), సౌమ్య (20), వారి చిన్నాన్న కూతురు అక్షయ స్కూటీపై వెళ్తున్నారు. అదే సమయంలో మద్యం మత్తులో అతివేగంతో చేవెళ్ల వైపు నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కారు వీరి స్కూటీని ఢీకొట్టింది. దీంతో ప్రేమిక అక్కడికక్కడే మృతి చెందగా, సౌమ్య, అక్షయ తీవ్రంగా గాయపడ్డారు. సౌమ్య చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందగా.. అక్షయ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.  


సౌమ్య మృతదేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పిస్తున్న మంత్రి సబితారెడ్డి  

చదవండి: (దేవుడా ఎంతపని చేశావయ్యా.. పెళ్లై నెలైనా కాలేదు.. ఇంతలోనే..)

వరుసగా రెండు రోజులు అంత్యక్రియలు 
ఒకే కుటుంబంలో వరుసగా రెండు రోజులు చెల్లి, అక్కా అంత్యక్రియలు జరిగాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.  ‘దేవుడా ఎందుకు కడుపుకోత మిగిల్చావ్‌.. ఇద్దరు బిడ్డలను ఒకేసారి తీసుకెళ్లావా..?’ అంటూ ఆ తల్లి రోదనలు అక్కడున్న వారి హృదయాలను కలచివేసింది. కాగా, నిందితుడు, అత్తాపూర్‌కు చెందిన సంపత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

చదవండి: (భర్త, కుమార్తెను వదిలి ప్రియుడితో వెళ్లిపోయి.. ఆది పరాశక్తి అవతారంలో..)

మంత్రి సబిత, ఎమ్మెల్యే యాదయ్య పరామర్శ
సౌమ్య అంత్యక్రియలకు సోమవారం మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరయ్యారు. సౌమ్య మృతదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఇద్దరు కూతుళ్లను కోల్పోయిన తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.    

మరిన్ని వార్తలు