Drugs Case: సిట్‌ అధికారి శ్రీనివాస్‌ను విచారించిన ఈడీ

30 Aug, 2021 18:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తమ విచారణను వేగవంతం చేసింది.  2017లో డ్రగ్స్‌ కేసు ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించిన సిట్‌ అధికారి శ్రీనివాస్‌ నుంచి ఈడీ అధికారులు వివరాలు సేకరించారు.  ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన వివరాలు ఎక్సైజ్ సిట్ అధికారి ఎస్. శ్రీనివాస్  ఈడీ అధికారులకు సమర్పించారు. డ్రగ్స్‌ కేసులో సిట్‌ దర్యాప్తు క్రమాన్ని శ్రీనివాసరావు ఈడీకి వివరించారు. కాగా ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు సినీ ప్రముఖలను ఈడీ ప్రశ్నించనున్న సంగతి తెలిసిందే. 

2017లో సిట్‌ విచారణ
హైదరాబాద్‌కు చెందిన అనేక మంది ప్రముఖులకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఓల్డ్‌ బోయిన్‌పల్లికి చెందిన కెల్విన్‌తోపాటు చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన సోదరులు అబ్దుల్‌ వహీద్, ఖుద్దూస్‌లను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు 2017 జూలై 2న అరెస్టు చేశారు. వీళ్లు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లతోపాటు విద్యార్థులు, సిటీ ప్రముఖులకు డ్రగ్స్‌ విక్రయించినట్లు అనుమానించారు. దీంతో ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు విభాగం (సిట్‌) ఏర్పాటై 10 మంది అనేక మందికి నోటీసులిచ్చింది. అదే ఏడాది జూలై 19 నుంచి కొన్ని రోజులు వీరిని విచారించింది. 

అప్పట్లో మొత్తం 12 కేసులు నమోదు చేసిన సిట్‌... 11 కేసుల దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేసింది. వీటిలో ఎక్కడా సినీ రంగానికి చెందిన వారిని నిందితులుగా చేర్చలేదు. 2017 జూలైలోనే టాలీవుడ్‌ ప్రముఖులతోసహా మొత్తం 62 మంది అనుమానితుల నుంచి జుట్టు, గోళ్ల నమునాలను సేకరించింది. ఆధారాల సేకరణ కోసం అప్పట్లో సిట్‌ విచారణకు హాజరైన సినీ ప్రముఖులను విచారించాలని తాజాగా నిర్ణయించింది. 

చదవండి: Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు

మరిన్ని వార్తలు