Mallanna Sagar: మనోవేదనతో చితి పేర్చుకుని దూకేశాడు

18 Jun, 2021 11:00 IST|Sakshi
చితిలో బూడిదైన మల్లారెడ్డి, ఇన్‌సెట్‌లో మల్లారెడ్డి ఫైల్‌ ఫొటో

సాక్షి, సిద్ధిపేట్‌ : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మల్లన్న సాగర్‌లో ఇళ్లు కోల్పోయి ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధుడు చితి పేర్చుకుని, ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తొగుట మండలంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తొగుట మండలం వేములగాట్‌కు చెందిన మల్లారెడ్డి భార్య చనిపోయిన తర్వాత ఒంటరిగా కాలం వెల్లదీస్తున్నాడు. కూతురి కుమారుడు(మనవడు) అప్పుడప్పుడు తాత దగ్గరకు వచ్చి వెళ్లేవాడు. కొన్ని నెలల క్రితం మల్లారెడ్డి ఉన్న ఇంటి జాగా మొత్తం మల్లన్న సాగర్‌ ప్రాజెక్టులో పోయింది.

ఈ నేపథ్యంలో మృతుడు డబుల్‌ బెడ్‌ రూం ఇంటికి దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు ఆయనకు ఇంటిని మంజూరు చేసి ఒంటరి వాడన్న కారణంతో వెనక్కు తీసుకున్నారు. ఇంటిని ఖాళీ చేయించారన్న మనో వేదనతో గురువారం అర్థరాత్రి తను నివాసం ఉండే ఇంట్లో చితి పేర్చుకుని..కిరోసిన్‌ పోసుకుని అందులో దూకాడు. దీంతో సజీవ దహనమయ్యాడు. మల్లారెడ్డి మనవడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు