ఐఎంఎస్‌ స్కాంలో దర్యాప్తు ముమ్మరం

12 Apr, 2021 08:11 IST|Sakshi

శ్రీనివాస్‌రెడ్డి, ముకుందరెడ్డి, వినయ్‌రెడ్డి, దేవికారాణికి ఈడీ సమన్లు 

పది రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశం 

ఐఎంఎస్‌ స్కాంలో దర్యాప్తు ముమ్మరం 

సాక్షి, హైదరాబాద్‌: ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) స్కాంలో దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ముమ్మరం చేసింది. ఈ కుంభకోణంలో ముఖ్య పాత్రధారులుగా ఈడీ భావిస్తున్న మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి ముకుందరెడ్డి, ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌ దేవికారాణిల నివాసాల్లో శనివారం సోదాలు నిర్వహించి ఆదివారం సమన్లు జారీ చేసింది. పది రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రమోద్‌రెడ్డి డొల్ల కంపెనీల వెనుక నేతల ప్రమేయంపై ఆధారాలు సేకరిస్తున్న ఈడీ.. నిందితులు పెద్ద ఎత్తున నగలు, ఆస్తులు కూడబెట్టుకున్నట్టు అనుమానిస్తోంది. కూడబెట్టిన ఆస్తులను అటాచ్‌ చేసేందుకు కూడా ఈడీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. నిందితుల ఇళ్లపై శనివారం హైదరాబాద్‌లో ఈడీ దాడులు జరపడం, వాటిల్లో కోదాడకు చెందిన ప్రమోద్‌రెడ్డి నిందితుడిగా ఉండటంతో కోదాడలో సంచలనం రేపింది. ఏపీలో జరిగిన ఈఎస్‌ఐ స్కాంలో కూడా ప్రమోద్‌రెడ్డి ప్రమేయం ఉండటంతో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్టు చేసినప్పుడు అతడు అజ్ఞాతంలోకి వెళ్లి 2 నెలల క్రితం న్యాయమూర్తి ముందు లొంగిపోయారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ప్రమోద్‌రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు జరపడం, భారీగా నగదు పట్టుబడటంతో మళ్లీ ఆయన పేరు చర్చనీయాంశమైంది.

 ( చదవండి: రోడ్డుపై గుంత: చందానగర్‌ ఇన్‌స్పెక్టర్‌కు నోటీసులు ) 

మరిన్ని వార్తలు