నిశ్చితార్థమైన యువకునితో బయటకెళ్లి.. ఇద్దరూ విషం తాగి..

1 Dec, 2022 07:49 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: నిశ్చితార్థమైన యువకునితో వెళ్లిన బాలిక అనుమానాస్పదరీతిలో చనిపోగా, యువకుడు కూడా ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన హాసన్‌ జిల్లా అరకలగూడు తాలూకా కోణనూరు హొబళిలో జరిగింది. కొడ్లూరు గ్రామానికి చెందిన దినేశ్‌కు కోణనూరుకు చెందిన 16 ఏళ్ల బాలికతో నిశ్చితార్థం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు రామనాథపురలో జరిగిన షష్ఠి జాతరకు బైకుపై దినేశ్‌తో కలిసి వెళ్లింది.

సాయంత్రం 4 గంటలకు మీ కూతురు విషం తాగిందంటూ దినేశ్‌ కుటుంబసభ్యులు ఫోన్‌ చేసి, హాసన్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించింది. దినేశ్‌ కూడా విషం తాగినట్లు గుర్తించారు. ఇతడు చికిత్స పొందుతున్నాడు. కూతురి మృతిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిశు సంక్షేమ సమితి కూడా ఎస్పీకి ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.  

కామాంధునికి 20 ఏళ్ల జైలు శిక్ష  
బాలునిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి ఉత్తరకన్నడ జిల్లా కారవార జిల్లా సత్ర న్యాయస్థానం మంగళవారం 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానాను విధించింది. కారవార వన్నహళ్లికి చెందిన అన్సారి ఖాసిం జింగ్రో ఈ ఏడాది మార్చి 15న ఆరేళ్ల బాలునికి చాక్లెట్‌ ఇప్పిస్తానని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. బాలుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదుచేశారు. నేరం రుజువు కావడంతో కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది. 

చదవండి: (పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాలీవుడ్‌ బ్యూటీ)

మరిన్ని వార్తలు