గుంటూరులో పట్టపగలు దారుణం.. ఇంజనీరింగ్‌ విద్యార్థిని హత్య

16 Aug, 2021 03:05 IST|Sakshi
రమ్య(ఫైల్‌)

కత్తితో మెడ, కడుపులో పొడిచి పరారైన యువకుడు 

యువతి జీజీహెచ్‌కు తరలింపు  

అప్పటికే మృతిచెందినట్టు వైద్యుల నిర్ధారణ  

మృతదేహాన్ని పరిశీలించిన అర్బన్‌ ఎస్పీ   

గంటల వ్యవధిలోనే నిందితుడు 

శశికృష్ణను పట్టుకున్న పోలీసులు 

సాక్షి, అమరావతి బ్యూరో/గుంటూరు ఈస్ట్‌: గుంటూరు నగరంలో ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే యువకుడు కత్తితో పొడిచి యువతి ప్రాణాలు బలితీసుకున్నాడు. ఆపై అక్కడి నుంచి బైక్‌పై పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు వివరాలు.. గుంటూరు నగరం కాకాని రోడ్డు పరమాయకుంటకు చెందిన నల్లపు వెంకట్రావు, జ్యోతి దంపతులకు మౌనిక, రమ్య(20) ఇద్దరు కుమార్తెలు. చేబ్రోలు సమీపంలోని సెయింట్‌ మేరీ‹స్‌ గ్రూప్‌ విద్యా సంస్థల్లో మౌనిక బీ ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతుండగా, రమ్య కూడా అదే విద్యా సంస్థలో ఇంజనీరింగ్‌(బీటెక్‌) మూడో సంవత్సరం చదువుతోంది. వెంకట్రావు, జ్యోతి దంపతులు ఏడాది కిందట కొల్లూరు మండలం చిలుమూరులో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. మౌనిక, రమ్య ఇద్దరూ పరమాయకుంటలోని తమ నివాసంలో నాయనమ్మ పుష్పలీలతో కలిసి ఉంటున్నారు. 
 
వాగ్వాదం.. ఆ తర్వాత హత్య 
లాక్‌డౌన్‌ కారణంగా కళాశాలలు లేకపోవడంతో రమ్య గత కొన్ని నెలలుగా తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. అయితే పది రోజుల కిందట నాయనమ్మ వద్దకొచ్చింది. ఆదివారం చర్చికి వెళ్లే క్రమంలో బయటకు వెళ్లి టిఫిన్‌ తెచ్చుకుంది. ఆ తర్వాత ఫోన్‌ రావడంతో నాయనమ్మతో.. ఇప్పుడే వస్తానంటూ సుమారు ఉదయం 10.20 గంటల సమయంలో రోడ్డు పైకొచ్చింది. మెయిన్‌ రోడ్‌పై బైక్‌పై ఉన్న కుంచాల శశికృష్ణతో కొంతసేపు మాట్లాడి అతడి బైక్‌ ఎక్కింది. ఇద్దరూ రోడ్డు అవతలి వైపునకు వెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమోగానీ రమ్య బలవంతంగా బైక్‌ దిగి రోడ్డుకు ఇవతలి వైపునకు వచ్చేసింది. ఆ యువకుడు కూడా బైక్‌పై రమ్య వద్దకు చేరుకున్నాడు.

రమ్యతో వాదులాడుతూ కొట్టడంతో ఆమె కిందపడిపోయింది. ఆ తర్వాత కత్తితో రమ్య మెడపై, పొత్తి కడుపులో ఆరు సార్లు పొడిచాడు. సమీపంలోని వ్యక్తి కేకలు వేయడంతో శశికృష్ణ బైక్‌పై ఆర్టీసీ బస్టాండ్‌ వైపు పరారయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో మౌనిక ఘటనా స్థలానికి చేరుకుని రమ్యను జీజీహెచ్‌కు తరలించింది. వైద్యులు రమ్యను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న అర్బన్‌ ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌ జీజీహెచ్‌కు వచ్చి రమ్య మృతదేహాన్ని పరిశీలించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్‌ బృందాలను రంగంలోకి దించారు.  
 
ఎవరూ అడ్డుకోలేదు..  
రమ్య తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున జీజీహెచ్‌కు తరలివచ్చారు. బిడ్డ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు.. విగత జీవిగా ఉన్న రమ్యను చూసి తల్లడిల్లిపోయారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. తన చెల్లిపై దాడి చేసే సమయంలో చుట్టుపక్కల వారంతా కేకలు వేయడంతో సరిపెట్టుకున్నారని, అడ్డుపడి ఉంటే తన చెల్లి బతికేదని మౌనిక కన్నీళ్లపర్యంతమైంది.  


శశికృష్ణ 
 
పోలీసుల అదుపులో శశికృష్ణ 
రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణను ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి సెల్‌ఫోన్‌ ఆధారంగా నిందితుడు వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. శశికృష్ణ తండ్రి గురవయ్య గుంటూరులో చేపల వ్యాపారం చేస్తుంటాడు. తండ్రిని బైక్‌పై దించేందుకే ఆదివారం శశికృష్ణ గుంటూరు వచ్చాడు. ఆ తర్వాత తల్లి భూలక్ష్మి వద్దకు వెళతానని తండ్రితో చెప్పాడు. శశికృష్ణ తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి ముప్పాళ్ల మండలంలోని గోళ్లపాడులో ఉంటోంది. నిందితుడు తల్లి దగ్గరకు వెళ్లి ఉంటాడన్న అనుమానంతో పోలీసులు వెతుకులాట ప్రారంభించారు.

ముప్పాళ్లలోని ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ సాయంతో నిందితుడి కదలికలను తెలుసుకున్నారు. గోళ్లపాడుకు సమీపంలో.. నరసరావుపేట మండలం పమిడిపాడు పొలాల్లో తిరుగుతుండగా పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే పక్కనే ఉన్న కాల్వలోకి దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. స్థానికులతో కలిసి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు శశికృష్ణ తన దగ్గర ఉన్న చిన్నపాటి కత్తితో గొంతుకు ఓ వైపు కోసుకుని పోలీసులను బెదిరించే ప్రయత్నం చేశాడు. పోలీసులు వెంటనే నరసరావుపేటలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి.. చికిత్స అందించి, తర్వాత గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.  
 
ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం 
శశికృష్ణకు రమ్య ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైనట్టు తెలుస్తోంది. అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో మూడు నెలలుగా గొడవపడుతున్నారు. అర్బన్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు నిందితుడి నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది.  

హత్య ఘటనపై సీఎం జగన్‌ ఆరా
బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు ప్రకటన
సాక్షి, అమరావతి: గుంటూరులో యువతి రమ్య హత్య ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ‘దిశ’ కింద వేగంగా చర్యలు తీసుకుని దోషికి కఠిన శిక్ష పడేలా చేయాలన్నారు. ఘటన వివరాలు తెలియగానే హోం మంత్రి ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారని, అండగా నిలబడతామంటూ భరోసా ఇచ్చిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని.. పరిహారంగా రూ.10 లక్షలు ఆ కుటుంబానికి ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశించారు. 

ఈ ఘటన దురదృష్టకరం 
గుంటూరు జిల్లాలో ఆదివారం జరిగిన ఘటన దురదృష్టకరమని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ‘గుంటూరు జిల్లా కాకానిలో జరిగిన దుర్ఘటన ఎంతో దురదృష్టకరం. విద్యార్థిని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. ఈ ఘటనపై దర్యాప్తును వేగవంతం చేసి, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని ఆదేశిస్తున్నాను. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది.’ అని ముఖ్యమంత్రి జగన్‌ ట్వీట్‌ చేశారు.   

హత్య చేసిన వాడికి ఉరే సరైన శిక్ష 
హోం శాఖ మంత్రి సుచరిత 
గుంటూరు ఈస్ట్‌ : బీటెక్‌ విద్యార్థిని రమ్యను హత్య చేసిన వ్యక్తికి ఉరే సరైన శిక్షని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. ఆమె ఆదివారం జీజీహెచ్‌కు వచ్చి రమ్య మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లిదండ్రులు వెంకట్రావు, జ్యోతిలను పరామర్శించి ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఘటన పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసినట్టు చెప్పారు. హత్యకు ముందు యువతి నిందితుడితో ఘర్షణ పడినట్టు తెలుస్తోందన్నారు. ఏదైనా సమస్యలుంటే తల్లిదండ్రులతో మాట్లాడి పరిష్కరించుకోవాలేగానీ హత్య చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళను చంపే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు.  


రమ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న హోం మంత్రి సుచరిత, మేయర్‌ మనోహరనాయుడు, ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌ 

ఎన్ని చట్టాలొచ్చినా, వాటిని కఠినంగా మార్చినా ఉన్మాదులు దారుణాలకు తెగబడుతూనే ఉన్నారని, ఇలాంటి వారిని ఏ విధంగా శిక్షించాలో.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారని, ఇప్పటికే ఆధారాలు సేకరించినట్టు హోం మంత్రి స్పష్టం చేశారు. రమ్య సెల్‌ఫోన్‌ను అన్‌లాక్‌ చేస్తే మరింత సమాచారం తెలుస్తుందన్నారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా రమ్య మృతదేహాన్ని జీజీహెచ్‌లో రాష్ట్ర మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ సందర్శించారు. రమ్య తల్లిదండ్రులను ఓదార్చారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు,  వేమూరు ఎమ్మెల్యే డాక్టర్‌ మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ తదితరులు యువతి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామన్నారు. 

దోషికి కఠిన శిక్ష పడేలా చేస్తాం : డీజీపీ 
రమ్య హత్య కేసులో నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేశామని, అతని నేరాన్ని నిరూపించి కఠిన శిక్ష పడేలా చేస్తామని డీజీపీ గౌతం సవాంగ్‌ చెప్పారు. ఈ హత్య అత్యంత దురదృష్టకరమని అన్నారు. స్థానికులు ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారాన్ని అందించారని ఓ ప్రకటనలో తెలిపారు.    

మరిన్ని వార్తలు