ముగ్గురు లేడీ కిలాడీలు.. అమాయక యువకులను సైగలతో ఆకర్షించి.. వ్యభిచారం ముసుగులో!

24 Jan, 2023 08:43 IST|Sakshi
అరెస్ట్‌ చూపుతున్న ఈస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటలక్ష్మీ    

సాక్షి, వరంగల్‌: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో వ్యభిచారం ముసుగులో దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను మామునూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటలక్ష్మీ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు కొత్తూరు గ్రామానికి చెందిన విజయ్‌కుమార్, పర్వతగిరికి చెందిన రాయపురం సరిత, కేసముద్రంకు చెందిన కోడం స్వరూప, నూనె స్వప్నలు కలిసి ఒక ముఠాగా ఏర్పడి సులభంగా డబ్బు సంపాదించాలని ప్రణాళిక రూపొందించుకున్నారు.

ఇందులో ముగ్గురు లేడీ కిలాడీలు ముఠాగా ఏర్పడి బస్‌స్టేషన్‌లలో అమాయకులైన యువకులను తమ సైగలతో ఆకర్షించి వారిని ప్రలోభ పెట్టి ఓ వాహనంలో ఎక్కించుకుని నిర్మాణుష్య ప్రదేశాలకు తీసుకెళ్లే వారు. ఈ క్రమంలో విజయ్‌కుమార్‌ సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకుని యువకులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు.

ఇప్పటికీ మామునూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు కేసుల్లో రూ.20వేలు, సెల్‌ఫోన్, గీసుకొండ పీఎస్‌ పరిధిలో రూ.3వేలు, సెల్‌ఫోన్‌లను బలవంతంగా దోచుకున్నారు. ఈ ముఠాపై ప్రత్యేక నిఘా ఉంచి మామునూరు ఇన్‌స్పెక్టర్‌ క్రాంతికుమార్‌ తన సిబ్బందితో సోమవారం రాంగోపాల్‌పురం వద్ద నిందితురాళ్లను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఏసీపీ నరేష్‌కుమార్, ఇన్‌స్పెక్టర్‌ క్రాంతి కుమార్, ఎస్సై రాజిరెడ్డి, కానిస్టేబుళ్లు సర్థార్‌పాషా, రోజాలను ఈస్ట్‌జోన్‌ డీసీపీ అభినందించారు.

మరిన్ని వార్తలు