Extra Marital Affair: వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి

24 Dec, 2022 10:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గద్వాల క్రైం (జోగులాంబ గద్వాల): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన సంఘటన శుక్రవారం గద్వాలలో కలకలం రేపింది. సీఐ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పెబ్బేరు మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన ఎండీ అబ్దుల్‌ (35) గద్వాల పట్టణానికి చెందిన మహబూబ్‌బీని 12 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరు గద్వాల పట్టణంలోని నల్లకుంట కాలనీలో అద్దె ఇంట్లో ఉంటూ కూరగాయాల వ్యాపారం చేస్తున్నారు.

దంపతులకు తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే భార్య అదే కాలనీకి చెందిన రఫీతో కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయంపై వారం రోజుల క్రితం భార్యతో గొడవపడ్డాడు. అయితే తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి గురువారం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ప్రియుడితో కలసి చున్నీతో గొంతుకు బిగించి ఊపిరాడకుండా హత్య చేశారు. ఇక భర్త తరఫు బంధువులకు భార్య ఫోన్‌ చేసి ఫిట్స్‌ వచ్చి మృతి చెందాడని చెప్పింది.

విషయం తెలుసుకున్న బంధువులు మృతదేహాన్ని పరిశీలించి మహబూబ్‌బీపై అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పట్టణ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. హత్య చేసినట్లు అంగీకరించారు. మృతుడి సోదరుడు మహ్మద్‌ హాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. భార్యను అదుపులోకి తీసుకున్నామని, ప్రియుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు