అదే ఊరి వ్యక్తితో సంబంధం.. ఎంత చెప్పిన భార్య తీరు మార్చుకోకపోవడంతో

9 May, 2022 10:28 IST|Sakshi
పోలీసులతో మృతుడి బంధువుల వాగ్వాదం, రాజు(ఫైల్‌)  

సాక్షి, నిజామాబాద్‌: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని హత్య చేశాడు ఓ భర్త. ఈ ఘటన శనివారం సాయంత్రం పెద్దకొడప్‌గల్‌ మండలంలోని కాస్లాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కస్తూరి అంజయ్య భార్య అదే గ్రామానికి చెందిన కేతావత్‌ రాజు(37)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో గతంలో పలుమార్లు గొడవలు జరిగాయి. అయినా వారు తీరు మార్చుకోలేదు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం అంజయ్య పొలం నుంచి తిరిగి వచ్చే సరికి ఇంట్లో తన భార్య, ప్రియుడితో కలిసి ఉంది. దీంతో ఆగ్రహానికి గురైన అంజయ్య రాజును హత్య చేశాడు. మెడపై కాలుతో తొక్కి, వైర్‌ తాడుతో ఉరి వేసి హత్య చేశాడు.

అనంతరం మృతదేహాన్ని బాత్‌రూంలో పెట్టి వెళ్లిపోయాడు. నిందితుడు ఆదివారం ఉదయం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయినట్లు ఎస్సై విజయ్‌ కొండ తెలిపారు. బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. సీఐ కృష్ణ, మద్నూర్‌ ఎస్సై శివకుమార్, పిట్లం ఎస్సై రంజిత్, పెద్దకొడప్‌గల్‌ ఎస్సై విజయ్‌ కొండ పాల్గొన్నారు.  
చదవండి: పాపం రమాదేవి.. భర్త ప్రాణాలు కాపాడబోయి.. 

మరిన్ని వార్తలు