Extramarital Affair: మహిళతో వివాహేతర సంబంధం.. కొన్నాళ్లు గడిచాక..

20 Jul, 2022 15:05 IST|Sakshi

అక్కిరెడ్డిపాలెం(గాజువాక) విశాఖపట్నం: జీవీఎంసీ 69వ వార్డు షీలానగర్‌లో సోమవారం అర్ధరాత్రి ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దువ్వాడకు చెందిన నామాల సురేష్‌ కుమార్‌ (38) కొన్నాళ్ల కిందట రష్మిక అనే మహిళను పెళ్లి చేసుకుని అదే ప్రాంతంలో నివసించేవాడు. అనంతర కాలంలో కంచరపాలెం ప్రాంతానికి చెందిన అఖిల్‌ అనే వ్యక్తితో రష్మికకు ఏర్పడిన పరిచయం వివాహేతర బంధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో కొన్నాళ్లు గడిచాక అఖిల్‌ వేధింపులు ఎక్కువ కావడంతో రష్మిక దువ్వాడ పోలీస్‌ స్టేషన్‌లో పలుమార్లు అఖిల్‌పై ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో దువ్వాడ నుంచి సురేష్‌కుమార్, రష్మిక షీలానగర్‌కు మకాం మార్చారు.
చదవండి: మిస్టరీగా చిన్నారి మృతి.. ఆటోడ్రైవర్‌ ఫోన్‌ కాల్‌ కీలకం!

అక్కడ ఓ అద్దె ఇంట్లో ఉంటూ సమీప బంధువు వద్ద క్యాటరింగ్‌ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో అఖిల్‌ సోమవారం అర్ధరాత్రి సమయంలో వీరి ఇంటికి చేరుకొని సురేష్‌ కుమార్‌పై దాడికి పాల్పడ్డాడు. తనతో తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో సురేష్‌ తలపై పలుమార్లు మోదడంతో తీవ్ర గాయాలై మృతి చెందాడు. దాడి అనంతరం అఖిల్‌ పరారయ్యాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.  కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన గాజువాక పోలీసులు నిందితుడు అఖిల్‌తోపాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మృతుని భార్య రష్మికను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే అఖిల్‌ వేధింపుల నుంచి తప్పించుకుని తలదాచుకునేందుకు దువ్వాడ నుంచి షీలానగర్‌ వచ్చి నివసిస్తున్న సురేష్‌కుమార్‌ దంపతుల ఇంటి అడ్రస్‌ అఖిల్‌కు ఎవరి ద్వారా తెలిసిందో అన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తంగా ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు.   

మరిన్ని వార్తలు