‘నకిలీ’ దందా.. డబ్బు గోవిందా 

24 May, 2021 13:26 IST|Sakshi
గుంతకల్లు రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ కార్యాలయం   

మృతి చెందిన రైల్వే ఉద్యోగి పేరుతో నాటకం

నకిలీ ఆపాయింట్‌మెంట్ల సృష్టి కర్తలు ఇంటిదొంగలే!

పోలీసులను ఆశ్రయించిన బాధితులు

తమ మెడకు చుట్టుకోకుండా తప్పించుకుంటున్న సిబ్బంది 

గుంతకల్లు(అనంతపురం): ‘నకిలీ అపాయింట్‌మెంట్‌’ల వ్యవహారం రైల్వే ఉద్యోగుల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. నకిలీ ఉత్తర్వుల వ్యవహారంలో ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం 12 మంది నకిలీ ఉత్తర్వులతో ఉద్యోగంలో జాయిన్‌ అవ్వడానికి  ప్రయత్నించారు. వీరిలో చెన్నైకి చెందిన టి.రవికుమార్‌ అనే వ్యక్తి ప్రస్తుతం అధికారుల అదుపులో ఉన్నాడు. మిగిలిన 11 మంది వివరాలు రైల్వే అధికారులు గోప్యంగా ఉంచారు. వాస్తవానికి ఇలాంటి నకిలీ ఉత్తర్వులతో దాదాపు 50 మందికి పైగా ఉద్యోగాల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఈ మొత్తం అక్రమాల్లో తమిళనాడుకు చెందిన 12 మంది నుంచే కాకుండా గుత్తి, గుంతకల్లుకు చెందిన మరో 38 మంది అభ్యర్థుల నుంచి రూ. లక్షలు వసూలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బు పర్సనల్‌ డిపార్టుమెంట్‌లోని కొందరు సిబ్బందితోపాటు ఒకరిద్దరు అధికారులు కూడా వాటాల రూపంలో దండుకున్నట్లు సమాచారం.

ఫోర్జరీ సంతకాలతో..  
అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌లో ఆఫీస్‌ ముద్రతోపాటు డీపీఓ పోర్జరీ సంతకంతో కూడిన ఉత్తర్వులు చూస్తుంటే దీని వెనుక పెద్ద గూడుపుఠానీ ఉన్నట్లు తెలుస్తోంది. ఏకంగా రైల్వే ఆస్పత్రి నుంచి ఫిట్‌నెస్, మెడికల్‌ సరి్టఫికెట్లు కూడా పొందారంటే..ఇందులో పర్సనల్‌ డిపార్టుమెంట్‌ కార్యాలయ సిబ్బంది ప్రమేయం తప్పకుండా ఉంటుందని రైల్వే ఉద్యోగులు అంటున్నారు. కాగా ఈ నకిలీ బాగోతం బహిర్గతం కావడంతో అప్రమత్తమైన అవినీతిపరులు తప్పిదం తమ మీదకు రాకుండా దారి మళ్లించే పథకం రచించినట్లు సమాచారం.

పోలీసులను ఆశ్రయించిన బాధితులు.. 
ఉద్యోగాల పేరిట మోసపోయిన బాధితులు ఆదివారం గుంతకల్లు వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. గుత్తి డీజిల్‌òÙడ్‌లో ఎం.విజయస్టాన్లీ అనే వ్యక్తి సోషల్‌ మీడియా ద్వారా పరిచయమయ్యాడనీ, ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి తమను నమ్మించాడు. ఈ ఏడాది జనవరిలో అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ కాపీలను అందజేశాడని తెలిపారు. అలాగే సర్టిఫికెట్, మెడికల్, ఫిట్‌నెస్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేసినట్లుగా వివరించాడు. తీరా జాయిన్‌ అయ్యే సమయంలో అవి పోర్జరీ సంతకాలతో కూడిన అపాయింట్‌మెంట్‌ లెటర్లు అని తేలడంతో తాము మోసపోయినట్లు బాధితులు బోరుమన్నారు.

చనిపోయిన వ్యక్తి పేరుతో దందా.. 
వాస్తవానికి నకిలీ ఆర్డర్‌ కాపీలతో తమను మోసపుచ్చాడని నిరుద్యోగులు చెబుతున్న విజయ్‌స్టాన్లీ అనే వ్యక్తి కొంతకాలం క్రితం కరోనాతో మృతి చెందాడు. అతని ఐడీ కార్డును ఉపయోగించుకుని ఓ వ్యక్తి తాను రైల్వే ఉద్యోగినంటూ మోసానికి తెర లేపినట్లు తెలిసింది. ఇలా 50 మంది తాము మోసపోయినట్లు వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. అయితే ఈ కుంభకోణంలోని ప్రధాన పాత్రధారులంతా పక్కకు తప్పుకొని... చనిపోయిన స్టాన్లీబాబుపైకి నేరం  నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు, రైల్వే అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అసలు సూత్రధారులు బయటపడే అవకాశం ఉంది.

చదవండి: అంతేనా లోకేష్‌.. టీడీపీ నేతల ప్రాణాలకు విలువే లేదా! 
‘పచ్చ’పేకలో ఖాకీ: ఎస్పీ జోక్యంతో బట్టబయలు 

మరిన్ని వార్తలు