మాయలేడి: ఇంత పనిచేసిందా?

24 Feb, 2021 09:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఒకే కూతురినని అధికారులకు బురిడీ 

దొంగ ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌తో విలువైన భూముల రిజి్రస్టేషన్‌   

తహసీల్దార్‌ ఫిర్యాదుతో మాయలేడిపై కేసు నమోదు   

నంద్యాల: తాను ఏకైక సంతానమని అధికారులకు బురిడీ కొట్టించి కోట్ల రూపాయల విలువైన తల్లి ఆస్తులను విక్రయించిన ఓ మహిళ బండారం నంద్యాలలో వెలుగుచూసింది. టూటౌన్‌ ఎస్‌ఐ పీరయ్య తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల పట్టణంలోని కోటావీధికి చెందిన అవుకు రమాదేవి అనే మహిళ తన తల్లి ఎల్ల నర్సమ్మకు తాను ఏకైక  సంతానమని, రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసి ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ పొందింది. సదరు మహిళ ఈ సర్టిఫికెట్‌ను చూపి తన తల్లికి చెందిన ఆస్తులను ఇతరులకు  రిజిస్ట్రేషన్లు‌ చేసింది.

అయితే, నర్సమ్మకు రమాదేవితో పాటు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయాన్ని రమాదేవి దాచి పెట్టి భూములను రిజిస్ట్రేషన్లు‌ చేసిన విషయం తహసీల్దార్‌కు తెలియడంతో గత నవంబర్‌ నెలలో ఆమెను పిలిపించి విచారించారు.  ఈ విచారణలో తనకు ముగ్గురు సోదరులు, నలుగురు సోదరీమణులు ఉన్న మాట వాస్తవమని ఒప్పకుంటూ, జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్ రద్దు చేయమని  రాత పూర్వకంగా రాసి ఇచ్చింది.  ఆ తర్వాత కూడా ఆమె ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ను అడ్డుపెట్టుకుని అవుకు మండలం గుండ్ల సింగవరానికి చెందిన మాదిరెడ్డి తిరుమలేశ్వరరెడ్డి, చిట్టెపు మద్దిలేటిరెడ్డి, బనగానపల్లెకు చెందిన వెంకట శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌బీఐ కాలనీకి చెందిన సీతారామిరెడ్డి, వెంకటకృష్ణారెడ్డిలకు  డిసెంబర్‌  30వ తేదీన విలువైన ఇళ్ల స్థలాలను  రిజి్రస్టేషన్‌ చేసి ఇచ్చింది.

ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ రవికుమార్‌.. రమాదేవి తప్పుడు సర్టిఫికెట్‌తో  రిజిస్ట్రేషన్లు చేస్తుందని  ఆమెపై కేసు నమోదు చేయాలని టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ మాయలేడిపై ఐపీసీ సెక్షన్‌ 177, 182, 199, 420, 419 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పీరయ్య తెలిపారు.

మరిన్ని వార్తలు