పెళ్లి పేరుతో రూ.11కోట్లకు నకిలీ ఐపీఎస్‌ మోసం

24 Feb, 2021 15:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తాను ఐపీఎస్‌ అధికారిని చెప్పి.. మా చెల్లితో పెళ్లి చేయిస్తానని చెప్పి ఓ వ్యక్తి నుంచి రూ.11 కోట్లు వసూలు చేసిన ఓ యువతిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ వ్యక్తి నుంచి ఆమె తీసుకున్న ఖరీదైన కార్లు, కోట్ల విలువైన ఆస్తుల వివరాలు తెలిసి పోలీసులే షాకయ్యారు. ఈ మోసాలు తన బంధువుతో కలిసి ఆమె చేసింది. ఆమెను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. శ్రుతిసిన్హా అనే యువతి ఐపీఎస్‌ అధికారిణిగా చలామణీ అవుతోంది. ఈ క్రమంలో వీరారెడ్డి అనే వ్యక్తిని కలిసింది. అతడి సోదరుడికి తన చెల్లిని ఇచ్చి వివాహం చేస్తానని శ్రుతిసిన్హా నమ్మించింది. ఈ క్రమంలో అతడి వద్ద నుంచి రూ.11 కోట్ల వరకు వసూలు చేసింది. ఆమె తన బంధువు విజయ్‌కుమార్‌ రెడ్డితో కలిసి మోసానికి పాల్పడింది.

అయితే నెల రోజుల కిందట విజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వ్యవహారం బయటకు పొక్కింది. వీరారెడ్డితో వసూలు చేసిన డబ్బుతో ఖరీదైన కార్లను శ్రుతి కొనుగోలు చేసింది. ఈ విషయం తెలుసుకున్న బాచుపల్లి పోలీసులు శ్రుతిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నిందితురాలి నుంచి 3 కార్లు, రూ.6 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె బారినపడి మోసానికి గురయిన వాళ్లు చాలా మంది ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

మరిన్ని వార్తలు