కిలాడీ దేవసేన.. అమ్మకు క్యాన్సర్‌ అని చెప్పి రూ.50 వేలు టోపీ

24 May, 2021 08:13 IST|Sakshi

టీ.నగర్‌: కారైకుడిలో నకిలీ మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. అమరావతి పురూరుకు చెందిన వడివుక్కరసి(33) మానగిరిలోని పాఠశాలలో తమిళ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. ఈమె భర్త మురుగానందం. ఇతను మాజీ సైనికుడు.

కొన్ని నెలల క్రితం వడివుక్కరసి సొంతపని నిమిత్తం తిరువాడానై వెళ్లి బస్సులో తిరిగివస్తుండగా పక్క సీట్లో కూర్చున్న మహిళ ఒకరు వడివుక్కరసితో మాటలు కలిపింది. తన పేరు దేవసేన అని, తెన్‌కాశి పోలీసు శాఖలో టెక్నికల్‌ విభాగం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం సెలవుపై వస్తున్నానని, తన సొంతవూరు దొండి అని పేర్కొంది. ఆ తర్వాత తరచుగా ఫోన్‌లో మాట్లాడడమే కాకుండా, కొన్ని సార్లు వడివుక్కరసి ఇంటికి వచ్చింది. ఒకరోజు వడివుక్కరసికి దేవసేన ఫోన్‌ చేసి తన అమ్మ కేన్సర్‌తో బాధపడుతున్నట్లు అర్జంటుగా రూ.50 కావాలని తెలిపింది. దీంతో వడివుక్కరసి దేవసేన బ్యాంకు ఖాతాకు రూ.50 వేలు పంపారు. ఆ తర్వాత దేవసేన నుంచి ఫోన్‌కాల్‌ రాలేదు.

ఆమె నెంబరుకు ఫోన్‌ చేయగా సరిగా మాట్లాడలేదు. దీంతో అనుమానించిన వడివుక్కరసి, ఆమె భర్త దొండి చిరునామాలో విచారించగా ఆమె కారైకుడి కళనివాసల్‌లోని స్నేహితురాలి ఇంట్లో ఉన్నట్లు తెలిసింది. దీంతో వడివుక్కరసి కారైకుడి నార్త్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి శనివారం దేవసేన (20)ను అరెస్టు చేశారు.
చదవండి: కరోనా దేవి.. అచ్చం నటి వనిత విజయకుమార్‌ మాదిరిగానే

మరిన్ని వార్తలు