సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలోకి గల్లంతు

17 Aug, 2022 08:56 IST|Sakshi

దొడ్డబళ్లాపురం: సెల్ఫీ తీసుకుంటూ ఓ యువకుడు గల్లంతైన సంఘటన కనకపుర తాలూకాలోని పర్యాటక కేంద్రం చుంచి ఫాల్స్‌ వద్ద జరిగింది. బెంగళూరు శంకరమఠం ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ప్రవీణ్‌ చంద్ర (26) మంగళవారంనాడు ముగ్గురు స్నేహితులతో కలిసి చుంచి ఫాల్స్‌ చూడడానికి వచ్చాడు.

నీరు ప్రవహించే చోట బండరాయిపై కూర్చుని సెల్ఫీ తీసుకుంటుండగా జారి 18 అడుగుల ఎత్తు నుంచి జలపాతంలోకి పడిపోయాడు. అతని స్నేహితులు కొంతసేపు వెతికినా కనిపించలేదు. దీంతో సాతనూరు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు.

చెక్‌డ్యాంలో మునిగి ఇద్దరు మృతి
మైసూరు: దేవస్థానం దర్శనం కాస్తా విషాదమయం అయ్యింది. చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు అందులో మునిగిపోయి మృతి చెందిన సంఘటన చామరాజనగర జిల్లాలో కొళ్లెగాల తాలూకాలోని చిక్కల్లూరులో చోటుచేసుకుంది. మళవళ్లి తాలూకా లింగపట్టణ గ్రామానికి చెందిన సునీల్‌ (26), చంద్రు (19)లు 30 మందితో కలిసి చిక్కల్లూరు దేవస్థానానికి వచ్చారు.

దేవుని దర్శనం అయిన అనంతరం హోసమఠం ముందు భాగంలో ఉన్న చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లారు. చాలా లోతుగా ఉండడంతో ఈత కొట్టలేక మునిగిపోయారు. స్థానికులు ఈతగాళ్ళను రప్పించి వారి మృతదేహాలను బయటికి తీశారు. కొళ్లెగాల గ్రామీణ పోలీసులు  కేసు నమోదు చేశారు. 

(చదవండి: ఫైట్‌ మాస్టర్‌ కణల్‌ కన్నన్‌ అరెస్ట్‌)

మరిన్ని వార్తలు