అత్త సూటిపోటి మాటలు.. వేధింపులు భరించలేక అల్లుడు..

2 Feb, 2022 06:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,హుబ్లీ (కర్ణాటక): అత్త వేధింపులకు అల్లుడు బలయ్యాడు. ఈ ఘటన  హుబ్లీ తాలూకా బ్యాహట్టి గ్రామంలో చోటు చేసుకుంది. మహమ్మద్‌రఫిక్‌ నదాఫ్‌ అనే వ్యక్తి భార్య అసామతో కలిసి గ్రామంలోనే తన అత్త సాహెబీ ఇంటి ఎదుటనే  నివాసం ఉంటున్నాడు.  

అత్తతోపాటు పొరుగింటిలో ఉంటున్న ముదుకప్ప, మాంత్యలు సూటిపోటి మాటలతో వేధిస్తుండటంతో మహమ్మద్‌రఫిక్‌ నదాఫ్‌ మనో వేదనకు గురై సోమవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హుబ్లీ రూరల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 

ఏఎస్‌ఐకు 20 ఏళ్ల జైలుశిక్ష 
మైసూరు: ఆపదలో ఉన్నవారిని రక్షించాల్సిన పోలీస్‌ అధికారి అయి ఉండి మతిస్థిమితం లేని యువతిని చెరబట్టిన కామాంధునికి కోర్టు కఠిన శిక్ష విధించింది. తుమకూరు నగరం అంతర సనహళ్ళి వద్ద యువతిపై ఏఎస్‌ఐ ఉమేశయ్య అత్యాచారం చేసినట్లు నేరం రుజువు కావడంతో అతనికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానాను విధిస్తూ జిల్లా 2వ సెషన్స్‌ కోర్టు జడ్జి హెచ్‌.ఎస్‌.మల్లిఖార్జునస్వామి మంగళవారం తీర్పు వెలువరించారు.  

ఒంటరి యువతిని చూసి..  
2017న జనవరి 14వ తేదీన రాత్రి ఒంటరిగా ఉన్న మతిస్థిమితం లేని యువతిని ఉమేశయ్య గస్తీకి వెళ్లినప్పుడు చూశాడు. కొంతసేపటికి కారులో వచ్చి యువతిని బెదిరించి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మరుసటిరోజును ఈ దారుణం తెలిసి యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఉమేశయ్యను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఉమేశయ్య నేరం చేసినట్లు కోర్టులో రుజువు కావడంతో శిక్ష తప్పలేదు.

ప్రభుత్వ న్యాయవాది కవిత పకడ్బందీగా వాదనలు వినిపించారు. రూ. లక్ష జరిమానాను బాధితురాలిగా అందజేయాలని దోషిని ఆదేశించారు. కాగా ఉమేశయ్య జీపు డ్రైవర్‌పై నేరం నిరూపణ కాకపోవడంతో అతనికి విముక్తి కల్పించారు. ఈ తీర్పుపై ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కామాంధులకు గుణపాఠం కావాలని పేర్కొన్నాయి.

చదవండిః కేంద్రం కీలక సంస్కరణ.. దేశంలో ఏకరీతిగా భూ రిజిస్ట్రేషన్‌..!

మరిన్ని వార్తలు