భర్త ఇంటి ముందు 40 రోజుల పోరాటం విషాదాంతం

7 Jan, 2022 11:57 IST|Sakshi

సాక్షి, హుజూరాబాద్‌(కరీంనగర్‌): కట్టుకున్నవాడు కాపురానికి తీసుకెళ్లడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. పోలీసులు, మృతురాలి సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూరాబాద్‌ పట్టణానికి చెందిన నరహరి సుజిత్‌రెడ్డి కడప జిల్లాకు చెందిన సుహాసిని రెడ్డి (32)కి 2011లో ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.

పెళ్లి ప్రస్తావన రాగానే పలుమార్లు సుజిత్‌ దూరం పెట్టడంతో సుహాసిని ఒత్తిడి తెచ్చింది. దీంతో 2020 నవంబర్‌లో హైదరాబాద్‌లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత సిటీలో కొంతకాలం కాపురం చేశాడు. తల్లిదండ్రులను ఒప్పించి తీసుకెళ్తానని ఊరికెళ్లాడు. ఆ తర్వాత ఎంతకూ తాను రాకపోవడంతో సుహాసిని హుజూరాబాద్‌ వెళ్లి భర్త ఇంటి ముందు 40 రోజులు ఒంటరి పోరాటం చేసింది.

అయినా భర్త, అత్తమామల మనసు కరగలేదు. మరోవైపు సుజిత్‌ మరో యువతిని వివాహం చేసుకున్నాడని తెలిసి మనస్తాపం చెంది బుధవారం భర్త ఇంటి ఎదుట గడ్డి మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచింది. సుజిత్‌ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌ నోట్‌లో సుహాసిని పేర్కొంది. తన చావుకు కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించి తన అవయవాలను దానం చేయాలని చెప్పింది. మృతురాలు సోదరుడు శివారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు