భర్తను కడతేర్చిన భార్య.. అసలు ఏంజరిగిందంటే

7 Jan, 2022 12:57 IST|Sakshi
సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న సీఐ, ఎస్‌ఐ

సాక్షి, చిన్నకోడూరు(మెదక్‌): కుటుంబాన్ని పోషించాల్సిన భర్త ఇంటిని పట్టించుకోకపోవడం, వేధింపులకు గురి చేస్తుండటంతో విసిగిన భార్య తాళి కట్టిన భర్తనే కడతేర్చింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపూర్‌లో జరిగింది ఈ విషాదక ఘటన. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన దంపతులు మర్కంటి ఎల్లయ్య(55)కు భార్య నర్సవ్వ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

కూతురు రేణుకకు 2014లో అదే గ్రామానికి చెందిన ఇప్ప మహేందర్‌తో వివాహం జరిపించారు. కాగా ఎల్లయ్య, నర్సవ్వ మధ్య కుటుంబతగాధాలతో తరచూ గొడవ పడుతుండేవారు. దీనిపై కుల పెద్దల సమక్షమంలో ఎల్లయ్యను మందలించినా మార్పు రాలేదు. మంగళవారం రాత్రి ఎల్లయ్య భార్యతో గొడవ పడి కర్రతో దాడి చేసి గాయపర్చాడు. దీంతో ఎల్లయ్య పడుకున్నాక తెల్లవారు జామున 5 గంటల సమయంలో నర్సవ్వ ఇంట్లో ఉన్న గొడ్డలితో భర్త ఎల్లయ్య మెడను నరికింది.

బలమైన గాయాలు కావడంతో ఎల్లయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. సిద్దిపేట రూరల్‌ సీఐ సురేందర్‌ రెడ్డి, ఎస్సై రాజేశ్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి కూతురు రేణుక ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.   

మరిన్ని వార్తలు