Khammam Crime: కాంట్రాక్టర్‌ మోసం చేశాడని.. కుటుంబం ఆత్మహత్యాయత్నం

26 May, 2022 09:05 IST|Sakshi

సరూర్‌నగర్‌ పరిధిలో ఘటన

ఖమ్మం నుంచి వచ్చి దిల్‌సుఖ్‌నగర్‌ లాడ్జిలో నిద్రమాత్రలు మింగిన భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు

పిల్లలు క్షేమం.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దంపతులు

చైతన్యపురి: పనులు పూర్తి చేసినా కాంట్రాక్టర్‌ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుండటంతో మనస్తాపానికిలోనైన ఓ సబ్‌ కాంట్రాక్టర్‌ కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సీతారాం కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..ఖమ్మం, ప్రశాంత్‌నగర్‌కు చెందిన చండ్ర శశికుమార్‌ ఎలక్ట్రికల్‌ కాంట్రాక్ట్‌ పనులు చేసేవాడు. హైదరాబాద్‌ పంజగుట్టకు చెందిన కాంట్రాక్టర్‌ జీవీ ప్రతాప్‌రెడ్డి కంపెనీ డైరెక్టర్‌ జీవీ దినేష్‌రెడ్డి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలలో నిర్వహిస్తున్న ఎలక్ట్రికల్‌ కాంట్రాక్ట్‌ పనులను శశికుమార్‌ తీసుకున్నాడు.

ఇందుకు సంబందించి సుమారు రూ.2 కోట్లు బిల్లులు రావాలని వెంటనే తనకు డబ్బులు ఇవ్వాలని దినేష్‌రెడ్డిని ఫోన్‌లో అడిగాడు. అయితే అతను స్పందించకపోవటంతో ఆదివారం శశికుమార్‌ తన భార్య శ్వేత, ఇద్దరు పిల్లలతో  హైదరాబాద్‌కు వచ్చి దిల్‌సుఖ్‌నగర్‌లోని గణేష్‌ లాడ్జిలో దిగారు. బుధవారం ఖమ్మంలో ఉంటున్న తన బావమరిది సురేష్‌కు ఫోన్‌ చేసి తామంతా సూసైడ్‌ చేసుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో సురేష్‌ సరూర్‌నగర్‌ పోలీసులకు సమాచారం అందించాడు. లాడ్జికి వెళ్లిన పోలీసులకు అప్పటికే అపస్మారకస్థితిలో అప్పటికే నిద్రమాత్రలు మింగి శశికుమార్, శ్వేత అపస్మారక పరిస్థితిలో కనిపించారు. ఇద్దరు పిల్లలు వాంతులు చేసుకుని ఉన్నారు. వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.  పిల్లలకు తక్కువ మోతాదులో ఇవ్వటంతో వారు క్షేమంగా ఉన్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. 

8 పేజీల సూసైడ్‌ నోట్‌ స్వాధీనం 
సెల్‌ఫోన్‌లో సూసైడ్‌ చేసుకోవడానికి కారణాలను వివరిస్తూ వీడియో రికార్డు చేసినట్లు గుర్తించారు.  అందులో తనకు రావాల్సిన, ఇవ్వాల్సిన డబ్బుల వివరాలు కూడా శశికుమార్‌ వివరించాడు. కాంట్రాక్టర్‌ తనపై మధిర పోలీస్‌ స్టేషన్‌లో దొంగతనం కేసు పెట్టాడని, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా తమను బెదిరిస్తున్నాడని, తాను అన్ని వివరాలు రాశానని వాటి ఆధారంగా అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. 

మరిన్ని వార్తలు