రైతుకు జరిమానా.. కట్టకపోతే బహిష్కరణ.. ఏం జరిగిందంటే?

19 Jun, 2021 10:28 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో అమ్గాన్‌ గ్రామ పంచాయతీ ఓ రైతుకు రూ. 21,000 జరిమానా విధించింది. పోలీసుల వివరాల ప్రకారం.. జూన్ 12న అమ్గావ్ తహసీల్‌లోని సీతేపార్ గ్రామానికి చెందిన తికారామ్ ప్రీతమ్ పార్ధి అనే రైతు తన పొలంలో భూమిని చదును చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు స్థానిక దేవత రాతి విగ్రహం దెబ్బతిన్నది తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని పార్ధిని పొలం పనులు ఆపేయాలని బలవంతం చేశారని అన్నారు. తర్వాత పంచాయతీ సమావేశం ఏర్పాటు చేసి, పార్ధి తమ మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించినట్లు పేర్కొన్నారు. ఇందుగాను అతనిపై రూ. 21 వేల జరిమానా విధించినట్లు తెలిపారు. అయితే ఈ మొత్తం చెల్లించకపోతే సామాజిక బహష్కరణను ఎదుర్కొటామని బెదిరించినట్లు అమ్గావ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌ విలాస్ నాలే తెలిపారు.

ఆ డబ్బు చెల్లించే ఆర్థిక స్తోమత లేదు!
కాగా ఈ మొత్తం డబ్బును దెబ్బతిన్న విగ్రహ నిర్మాణానికి, మిగిలిన క్రతువులకు ఉపయోగించుకోనున్నట్లు పంచాయతీలో తీర్పు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కానీ పార్ధి తన ఆర్థిక స్తోమత బాగోలేనందున డబ్బు చెల్లించలేకపోయాడని, అనంతరం పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా గ్రామ సర్పంచ్ గోపాల్ ఫులిచంద్ మెష్రామ్, పోలీసు పాటిల్ (గ్రామస్థాయి పోలీసు అసిస్టెంట్) ఉల్హాస్రావ్ భైయలాల్ బిసెన్, రాజేంద్ర హివర్లాల్ బిసెన్, పురన్ లాల్ బిసెన్, యోగేష్ హిరలాల్ బిసెన్, యాదవరావ్ శ్రీరామ్ బిసెన్, ప్రతాప్ లధాన్ లంచన్‌లపై మహారాష్ట్ర ప్రొహిబిషన్ ఆఫ్‌ పీపుల్ ఫ్రమ్ సోషల్ బాయ్‌కాట్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్) చట్టం, 2016 కింద కేసు నమోదు చేసి, నిందితులకు నోటీసులు జారీ చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ నాలే తెలిపారు. దీనిపై సర్పంచ్ మేష్రామ్ మాట్లాడుతూ.. స్థానిక సాంప్రదాయం ప్రకారం, గ్రామస్తులు విగ్రహాన్ని పూజించడం ద్వారా ప్రతి సంవత్సరం కొత్త పంట కాలం ప్రారంభమవుతుందన్నారు. పార్ధిని చెల్లించమని అడిగిన మొత్తం డబ్బుతో విగ్రహాన్ని మరమ్మతు చేసి, చిన్న ఆలయం నిర్మించడానికి పంచాయతీలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
చదవండి: హిజ్రాలకు  ఉద్యోగాల్లో రిజర్వేషన్‌

మరిన్ని వార్తలు