ఫాంహౌస్‌లో బర్త్‌డే పార్టీ: 64 మందిపై కేసు 

14 Jun, 2021 08:34 IST|Sakshi

కడ్తాల్‌: లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఓ ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్న బర్త్‌డే పార్టీని పోలీసులు అడ్డుకున్నారు. నిర్వాహకులతోపాటు మరో 64 మంది యువతీయువకులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ సమీపంలో శనివారం రాత్రి జరిగింది. ఇందుకు సబంధించిన వివరాలను ఆదివారం ఎస్‌ఐ సుందరయ్య వెల్లడించారు.  

కడ్తాల్‌ మండల కేంద్రం సమీపంలో బాక్స్‌ ఫాంహౌస్‌లో హైదరాబాద్‌ నగరానికి చెందిన వరుణ్‌గౌడ్‌ శనివారం రాత్రి తన బర్త్‌డే వేడుకలను నిర్వహించాడు. వేడుకల్లో ఆయ న మిత్రులైన నగరానికి చెందిన 60 మందికి పైగా యువతీయువకులు పాల్గొన్నారు. యువతీయువకులు మద్యం సేవించి డీజే సౌండ్‌తో నృత్యాలు చేస్తూ హోరెత్తిస్తున్నారు.  

►  విశ్వసనీయ సమాచారంతో శనివారం రాత్రి 11 గంటలకు ఎస్‌ఓటీ సిబ్బంది, కడ్తాల్‌ పోలీసులు కలిసి ఫాంహౌస్‌పై దాడులు చేశారు. 47 మద్యం సీసాలతో పాటు, డీజే సౌండ్‌ సిస్టమ్‌ను స్వాధీనం చేసుకున్నారు.  

► బర్త్‌డే వేడుకలు జరుపుకొంటున్న వరుణ్‌గౌడ్‌ పరారీలో ఉన్నాడని, అతడితోపాటు ఈవెంట్‌ నిర్వాహకులు భరత్, జీషాన్‌ అలీఖాన్, అన్వేష్‌తో పాటు వేడుకల్లో పాల్గొన్న 43 మంది యువకులు, 21 మంది యువతులపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. వారికి కౌన్సిలింగ్‌ నిర్వహించి, సొంత పూచీకత్తుపై విడిచిపెట్టినట్లు తెలిపారు.
చదవండి: మెసేజ్‌ కొట్టు.. గుట్కా పట్టు.. సరిహద్దులో జోరుగా సాగుతున్న దందా..

మరిన్ని వార్తలు