హైదరాబాద్‌లో దారుణం.. ఫాస్ట్‌ఫుడ్‌ లేదన్నాడని.. కత్తితో తెగబడ్డాడు

17 Jan, 2022 06:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌(జీడిమెట్ల): దూకాణం మూసే సమయంలో ఫాస్ట్‌ఫుడ్‌ను ఇచ్చేందుకు నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన ఓ వ్యక్తి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వాహకుడిపై  కత్తితో దాడి చేసిన ఘటన జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. సుభాష్‌నగర్‌ లాస్ట్‌బస్టాప్‌ ప్రాంతంలో బిద్యాధర్‌(32) ఫాస్ట్‌పుడ్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో దుకాణాన్ని మూసివేస్తుండగా పక్కనే ఉండే పాన్‌షాప్‌ నిర్వాహకుడు యాసిన్‌ ఫాస్ట్‌ఫుడ్‌ కావాలని వచ్చాడు. అయితే చాలా ఆలస్యమైంది, దుకాణం మూసివేస్తున్నాం, ఇప్పుడు ఇవ్వలేనని బిద్యాధర్‌ సమాధానం ఇచ్చారు. దీంతో ఇరువురికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

అక్కడ నుంచి వెళ్లిపోయిన యాసిన్‌ 10 నిమిషాల తరువాత తన వెంట కత్తిని తెచ్చుకుని బిద్యాధర్‌ మెడ, ఛాతిపై పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో బిద్యాధర్‌ బిగ్గరగా అరవడంతో చుట్టు పక్కల వారు వచ్చి చూడగా అప్పటికే యాసిన్‌ పరారయ్యాడు. క్షతగాత్రుడిని షాపూర్‌నగర్‌లోని మెడ్‌విజన్‌ ఆస్పత్రిలో  చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: (Chicken Sales: అయ్య బాబోయ్‌.. రికార్డు స్థాయిలో చికెన్‌ లాగించేశారు) 

మరిన్ని వార్తలు