మొదటి భర్తతో సాన్నిహిత్యం.. తనకు పుట్టలేదనే అనుమానంతో..

3 Dec, 2021 08:44 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ సైదులు 

చిన్నారిని కడతేర్చిన మారు తండ్రి 

వివరాలు వెల్లడించిన మెదక్‌ డీఎస్పీ సైదులు 

సాక్షి, టేక్మాల్‌(మెదక్‌): సొంత కూతురు కాదనే అనుమానంతో చిన్నారిని గొంతు నులిమి హత్యచేసిన మారు తండ్రిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపినట్లు మెదక్‌ డీఎస్పీ సైదులు తెలిపారు. గురువారం సీఐ జార్జ్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. మండలంలోని పల్వంచ గ్రామానికి చెందిన బూర్ల రమణయ్యకు అదే గ్రామానికి చెందిన సావిత్రితో 2014లో వివాహమైంది. ఇద్దరి మధ్య గొడవలు జరిగి రెండేళ్ల తర్వాత విడిపోయారు. తర్వాత సావిత్రి అందోల్‌ మండలం రోళ్లపాడ్‌కు చెందిన ఓ వ్యక్తితో వివాహం జరగగా, వారికి వర్షిణి(3) కూతురు ఉంది.

చదవండి: (14 ఏళ్ల మేనల్లుడితో శారీరక వాంఛలు.. వీడియో రికార్డ్‌ చేసి..)

ఈ క్రమంలో సావిత్రి మొదటి భర్త రమణయ్యతో సాన్నిహిత్యం ఏర్పడడంతో రోళ్లపాడ్‌కు చెందిన వ్యక్తికి విడాకులిచ్చి, 8నెలల క్రితం రమణయ్యను వివాహం చేసుకుంది. తన వెంట కూతురు వర్షిణిని తీసుకువెళ్లింది. గర్భిణి అయిన సావిత్రిని ఆస్పతికి చూపించేందుకు గురువారం టేక్మాల్‌ ఆస్పత్రికి వచ్చి వెళ్తుండగా, రమణయ్య, భార్యను ఇంటికి పంపించి, కూతురు వర్షిణిని పాల్వంచ శివారుకు తీసువెళ్లి గొంతు నులిపి చంపాడు. అనంతరం మృతదేహాన్ని ఎత్తుకొని ఇంటికి వెళ్లి వాంతులు చేసుకొని మృతిచెందిందని అబద్దం చెప్పాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని, విచారించగా నేరం అంగీకరించాడు. వర్షిణిని తనకు పుట్టలేదని కోపంతో పథకం ప్రకారం హత్యచేసినట్లు ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. రమణయ్యను అరెస్టు చేసి రిమాండ్‌ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 

చదవండి: (నాగరాజు ఇంటిపై ఏసీబీ దాడులు.. దిగులుతో భార్య మృతి)   

మరిన్ని వార్తలు