తండ్రి రాక్షసత్వం.. భార్యపై కోపంతో ఊపిరి ఆడకుండా చేసి

30 Apr, 2021 12:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కూతురుని తండ్రే చంపేసిన ఘటన గురువారం నగరంలో చోటు చేసుకుంది. కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని కొత్తపేట మాకిన వారి వీధిలో జగుపల్లి రాజా, యుగంధరిలు ఏడేళ్ల పాపతో కలిసి జీవనం సాగిస్తున్నారు. గొల్లపూడిలోని కాంప్లెక్స్‌లో మెడికల్‌ షాపులో రాజా పనిచేస్తున్నాడు. మూడు నెలల నుంచి రాజా పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండటంతో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తాయి. ఈవిషయంపై బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య వివాదం జరిగింది.

వచ్చే ఆదివారం ఈ వివాదంపై పెద్దల సమక్షంలో చర్చిద్దామని భార్యాభర్తలు అనుకున్నారు. గురువారం ఉదయం యుగంధరి పాపను తీసుకుని కొత్తపేటలోనే ఉంటున్న తన అమ్మ ఇంటికి వెళ్లింది. కూతురును పంపమని రాజా ఫోన్‌ చేయడంతో యుగంధరి పాపను ముందు పంపి తర్వాత తాను కూడా ఇంటికి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత పాపను ఇంట్లో వదిలిన యుగంధరి మళ్లీ తన అమ్మ దగ్గరకు వెళ్లింది. ఈ సమయంలో రాజా భార్యపై ఉన్న కోపాన్ని కూతురిపై చూపిస్తూ పాప ముఖంపై దిండు అదిమిపెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. యుగంధరి ఇంటికి వచ్చి చూసే సరికి పాప మంచంపై పడి ఉండటం చూసి నిశ్చేష్టురాలైంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజాను పోలీసులు అదుపులోకి సంఘటనకు దారి తీసిన పరిస్థితులపై విచారిస్తున్నారు.

చదవండి: ఎవరి కోసం చేశారు?.. దేవినేని ఉమాపై సీఐడీ ప్రశ్నల వర్షం
‘ప్రైవేటు’ నిర్వాకం.. ఇదేంటని ప్రశ్నిస్తే వైద్యం బంద్

మరిన్ని వార్తలు